Record Price Of Tomato In Madanapalle Market - Sakshi
Sakshi News home page

మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.196

Jul 29 2023 7:23 PM | Updated on Jul 29 2023 7:31 PM

Record Price Of Tomato In Madanapalle Market - Sakshi

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కడుతూ.. తాజాగా టమాటా కిలో రూ.196 ధర పలికింది. టమాటా ధర మరింత పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాటా ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. మొదటి రకం టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్‌కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

దేశం మొత్తం మీద ప్రస్తుతం టమాటా మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, గుర్రంకొండ, అంగళ్లు, ములకలచెరువు.. కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లె మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా టమాటాకు ఉన్నటువంటి డిమాండ్‌ దృష్ట్యా ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో మకాం వేసి అధిక ధరలకు టమాటాను కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన సరుకు వచ్చినట్లే అధిక ధరలకు అమ్ముడవుతుండటంతో తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: బాబు అండ్‌ బ్యాచ్‌ ఓవరాక్షన్‌.. నిర్మల సీతారామన్‌ చెప్పింది విన్నారా?

రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె మార్కెట్లో రైతుల నుంచి సగటున కిలో రూ.104 చొప్పున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు మరో నెలవరకు ఇలాగే కొనసాగుతాయని, అప్పటికి మదనపల్లె మార్కెట్‌లో సీజన్‌ పూర్తయితే అనంతపురం, డోన్‌, గుత్తి మార్కెట్లలో సరుకు లభ్యత వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement