డీఎంఈ ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల విధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థుల పని గంటలు, డ్యూటీ రోస్టర్లు, సెలవులు, ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందులో ఎన్ఎంసీ మార్గదర్శకాలు, అమలు ప్రాధాన్యం గురించి వివరించారు.
ఉత్తర్వులలోని ప్రధాన అంశాలివే..
» పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదు.
» వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదు.
» ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక రోజు పూర్తి సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి.
» రాత్రి విధులు (నైట్ డ్యూటీ) తర్వాత రోజున సెలవు ఇవ్వాలి.
» పీజీలకు 7 నుంచి 8 గంటల నిద్రకు అవకాశం ఇవ్వాలి.
» ప్రతి పీజీ విద్యార్థికి సంవత్సరానికి 20 రోజుల పెయిడ్ క్యాజువల్ లీవులు, 5 రోజుల అకడమిక్ లీవులు, 52 వారాంతపు సెలవులు ఉంటాయి.
» వారాంతపు సెలవులను ఇతర సెలవులతో సర్దుబాటు చేయకూడదు.
» ప్రతి కళాశాలలో నోడల్ అధికారిని నియమించి, నెలవారీ కంప్లయన్స్ రిపోర్టును తదుపరి నెల 10వ తేదీలోపు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి పంపాలి.
» ప్రతి నెల సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పీజీ వైద్య విద్యార్థులకు సంబంధించిన అంశాలను సమీక్షించాలి.
» సమీక్ష సమావేశాలు నిర్వహించకపోయినా, కంప్లయన్స్ రిపోర్టులు సమర్పించకపోయినా సంబంధిత ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, హెచ్ఓడీలపై తగిన చర్యలు ఉంటాయి.


