వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి హెచ్చరిక
జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు, పార్టీ శ్రేణులు
ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ, జీబీసీ, హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టు భూములకు సాగునీరు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్దఎత్తున తరలివచ్చిన ఆయకట్టు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ఉరవకొండ మండలం చిన్నముసూ్టరు గ్రామ సమీపంలోని 42వ జాతీయ రహదారి (అనంతపురం–బళ్లారి)ని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు.
తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లో నీరు ఉన్నా హెచ్చెల్సీ, హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో 90 రోజుల పాటు సాగునీరు విడుదల చేస్తుండగా, మన రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా హెచ్చెల్సీ ద్వారా నీరు ఇవ్వడం లేదన్నారు.జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు సరిపోతాయని, మిగిలిన వాటా నీటిని ఆయకట్టుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రేవంత్రెడ్డికి అమ్ముడుబోయి శ్రీశైలం నీటిని దిగువకు వదిలేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.


