సిండికేట్‌ దోపిడీకి రెన్యువల్‌ | Extension of liquor shop license period | Sakshi
Sakshi News home page

సిండికేట్‌ దోపిడీకి రెన్యువల్‌

Aug 29 2026 4:29 AM | Updated on Aug 29 2026 4:29 AM

Extension of liquor shop license period

మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు..!

గడువు ముగిసినా కొత్త టెండర్లకు ససేమిరా

ఏడాదిపాటు రెన్యువల్‌కు ప్రతిపాదన 

స్థానిక సంస్థల ఎన్నికల సాకు

సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్‌ ఏకపక్ష దోపిడీకి కూటమి ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపనుంది. లైసెన్స్‌ గడువు ముగిసినా కొత్త టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ససేమిరా అంటోంది. ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్‌ గుప్పిట్లో ఉన్న మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్స్‌లను రెన్యువల్‌ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. పారదర్శకమైన టెండర్‌ విధానం ద్వారా లైసెన్సులు కేటాయించాలన్న నిబంధనలను తోసిరాజంటూ సిండికేట్‌ దోపిడీని రెన్యువల్‌ చేయడానికి సిద్ధపడుతోంది. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలను సాకుగా చూపుతోంది.

ఏకపక్షంగా ఏడాదిపాటు రెన్యువల్‌
రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నింటినీ టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2024 అక్టోబరులో రెండేళ్ల కాలపరివిుతితో వాటి­కి లైసెన్సులు జారీ చేశారు. టీడీపీ సిండికేట్‌ సభ్యు­లు తప్ప ఇతరులు ఎవరూ దరఖాస్తు కూ­డా చేయకుండా అప్పట్లో టీడీపీ గూండాలు అడ్డు­కున్నారు. పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో బెదిరించి బెంబేలెత్తించారు. దాంతో మొ­త్తం 3,736 మద్యం దుకాణాలను ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌ దక్కించుకుంది. వాటి లైసెన్స్‌ గడువు అక్టోబరు 10కి ముగుస్తుంది. 

నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్సుల కేటాయింపునకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయా­లి. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. అనంత­రం పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయించాలి. కానీ పారదర్శకంగా లైసె­న్సులు కేటాయిస్తే తమ అక్రమాలు ఎలా సాగుతాయని సిండికేట్‌ పెద్దలు భావించారు. అందుకు ప్రభుత్వ పెద్దలు కూడా వత్తాసు పలి­కారు. దీంతో టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న మొ­త్తం మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా రెన్యువల్‌ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 

మొదట రెండేళ్ల పాటు లైసెన్సులు రెన్యువల్‌ చేయాలని భావించారు. కానీ న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో మొదట ఏడాదిపాటు రెన్యువల్‌ చేయాలని ప్రతిపాదించా­రు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంలేదని సాకుగా చూపించాలని ఎత్తుగడ వేశారు. తద్వారా న్యాయపరమైన అభ్యంతరాల­ను కప్పిపుచ్చవచ్చన్నది ప్రభుత్వ పెద్దల లక్ష్యం.

దుకాణానికి రూ.40 లక్షలు..!
2024లో మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచినప్పుడు దరఖాస్తు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.1,900 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఏకపక్షంగా లైసెన్సులు రెన్యువల్‌ చేస్తే ప్రభుత్వ ఖజా­నాకు నష్టం అని ఎవరైనా న్యాయస్థానంలో కేసులు వేయవచ్చని, తమ పన్నాగం బెడిసికొడుతుందని ప్రభుత్వ పెద్దలు సందేహించారు. అందుకే లైసెన్సుల రెన్యువల్‌కు ఒక్కో దుకాణానికి రూ.40 లక్షలు ఫీజుగా నిర్ణయించినట్టు తెలు­స్తోంది. ఆ ఫీజు చెల్లిస్తున్నారు కాబట్టి లైసెన్సులు రెన్యువల్‌ చేశామనే వాదనతో టీడీపీ సిండికేట్‌ దోపిడీకి రాచబాట వేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement