
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు బుధవారం పత్తికొండలో చుక్కెదురైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన కర్నూలు, కోడుమూరు, దేవనకొండ మీదుగా పత్తికొండకు చేరుకున్నారు. దేవనకొండలో విద్యార్థి, ప్రజాసంఘాల సంఘాల నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
వారిని పోలీసులు అడ్డుకొని కాన్వాయ్ను ముందుకు పంపారు. పత్తికొండకు చేరుకోగానే స్థానికులు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గో బ్యాక్ బాబు.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు.
ప్రశ్నిస్తే అరెస్టులే సీఎం పని: బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పత్తికొండలో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయిస్తారో తెలియడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బాబు వెంట కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, కోట్ల సుజాతమ్మ, వైకుంఠం మల్లికార్జునచౌదరి, కేఈ శ్యాంబాబు, గౌరు చరితారెడ్డి, బీసీ జనార్ధన్రెడ్డి ఉన్నారు.
ఈసారి అధికారంలోకి రాకపోతే ఇవే నాకు ఆఖరి ఎన్నికలు
2024లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే, తనకు ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.