కన్నా.. ఇక మిమ్మల్ని చూడటానికి రానురా! | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లా: హృదయవిదారకం.. కన్నా ఇక మిమ్మల్ని చూడటానికి రానురా!

Published Tue, Jan 3 2023 2:04 PM

Parents Dies By Suicide Child Become Orphans Annamayya District - Sakshi

సాక్షి, అన్నమయ్య:  భార్య దూరమైందన్న బాధ.. పిల్లల సంరక్షణ భారంగా అనిపించి పిరికి చర్యకు పూనుకున్నాడు ఆ వ్యక్తి.  ఆ దంపతుల నడుమ గొడవలు.. ఆపై బలవన్మరణాలతో పిల్లలను అనాథలను చేశారు. కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్‌ వాళ్లు చెప్పినట్లు వినాలి. బాగా చదువుకోవాలి అంటూ తండ్రి చెప్పిన చివరి మాటలు గుర్తు చేసుకుంటున్నారు. తల్లి దూరమైన రెండు వారాలకే తండ్రి కూడా చనిపోవడంతో కన్నీటి పర్యంతరం అవుతున్నారు ఆ చిన్నారులు. 

కలమడి ప్రసాద్‌బాబు (35), సుకన్య (28) దంపతులు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. బేల్దారి పనులు చేసుకుంటూ ప్రసాద్‌బాబు కుటుంబాన్ని పోషించేవాడు. అయితే.. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. రెండు వారాల కిందట గొడవ పెద్దది కావడంతో.. సుకన్య క్షణికావేశంతో ఉరేసుకుంది.

అప్పటినుంచి ప్రసాద్‌బాబు మనోవేదనకు గురయ్యాడు. భార్య దూరం కావడం, పిల్లలను పోషించడం తన వల్ల అవుతుందో లేదో అని బెంగ పెట్టుకున్నాడు. స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను గత నెల 29న ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించాడు. 

తాను వారిని పోషించలేనని, మీరే చూసుకోవాలంటూ లేఖ రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకుని రాజంపేట బాలసదన్‌లో చేర్చారు. అయితే.. ఆదివారం కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రసాద్‌బాబు పిల్లల వద్దకు వెళ్లాడు. వాళ్లకు మంచి చెప్పాడు. తాను ఇంక చూడడానికి రాలేనని చెప్పడంతో వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఉదయం రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.


మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement