పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం | Officials clarification on Mega DSC 2025 | Sakshi
Sakshi News home page

పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం

Jun 12 2026 4:58 AM | Updated on Jun 12 2026 4:59 AM

Officials clarification on Mega DSC 2025

అది ప్రభుత్వ నిర్ణయం.. ఇందులో మా తప్పిదం లేదు 

మెగా డీఎస్సీ–2025పై అధికారుల స్పష్టీకరణ 

డీఎస్సీ పూర్తయ్యాక ప్రభుత్వం మళ్లీ జీవో మార్చడం నిజమే 

1:1 నిష్పత్తి డైనమిక్‌ థింగ్‌  

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోవడం కష్టం 

అంతా ప్రభుత్వ పాలసీ ప్రకారమే జరిగిందని వెల్లడి  

అధికారులను ముందు పెట్టి మంత్రుల పలాయనం 

సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ–2025లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ, క్రీడా శాఖల మంత్రులు అధికారులతో ప్రెస్‌మీట్లు పెట్టించి తప్పుకున్నారు. దగా డీఎస్సీపై గత 20 రోజులుగా ఆధారాలతో సహా వస్తున్న వరుస కథనాలపై నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ గురువారం సంయుక్తంగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. 

నిజానికి స్పోర్ట్స్‌ డీఎస్సీలో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా,  పోటీల్లో పాల్గొన్న వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం నిర్ణయం మేరకు జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డీఎస్సీ లేకుండా టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.  నియామక ప్రక్రియ ముగిశాక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని జీవో ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఆ మేరకు తాము పని చేశామని వివరణ ఇచ్చారు.  

కీలక ఆరోపణలపై సమాధానం దాటవేత 
కృష్ణా జిల్లాకు చెందిన నవీన్‌ ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌లో జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు సమాధానం దాటవేశారు. నవీన్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి నవీన్‌కు కాల్‌ లెటర్‌ రాకుండా అతడి లాగిన్‌ ఐడీని ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. 

కాల్‌ లెటర్‌ లేకుండా ఎలా హాజరు కాగలడన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. డీఎస్సీ కన్వీనర్‌ను తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ను నియమించడం, ప్రశ్నావళిని రూపొందించే వారికే పగ్గాలు అప్పగించడాన్ని కూడా అధికారులు సమర్థించుకున్నారు. ఈ రెండు విభాగాలు విద్యా శాఖలోనే ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వ పాలసీ మేరకు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిందని మరోమారు వెల్లడించారు.   

పరీక్ష లేకుండా పోస్టు.. ప్రభుత్వ పాలసీ  
స్పోర్ట్స్‌ డీఎస్సీలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్‌ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా, అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు ఐదేళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీగా చెప్పడం గమనార్హం. 

తమిళనాడులో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తున్నారని, స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం ఇచ్చేందుకు అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. మళ్లీ క్రీడా పాలసీ జీవో మార్చి.. ఇకపై పరీక్షలు ఉంటాయని ఎందుకు పెట్టారన్న అంశంపైనా సరైన సమాధానం రాలేదు. అది ప్రభుత్వ పాలసీ అని, తామేమీ చేయలేమన్నారు. అంతా పారదర్శకంగానే చేశామంటూ.. 1:1 నిష్పత్తి డైనమిక్‌ థింగ్‌ అని చెప్పుకొచ్చారు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోవడం కష్టమన్నారు. 

అన్ని రకాల రిజర్వేషన్లు పరిశీలించిన తర్వాతే 1:1 నిష్పత్తిలో కాల్‌ లెటర్లు పంపినప్పుడు.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అధికారులు చెప్పడం చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే అక్రమాలను దాస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. వాస్తవానికి మెరిట్‌లో ఉండి కాల్‌ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో మొదటి విడత సర్టిఫికెట్‌ పరిశీలనకు తొలిరోజు హాజరైన వారే అధికంగా ఉన్నారు. వారంతా రిజర్వేషన్‌ పరిధిలో ఉన్నప్పటికీ, లేరని చెప్పడం విస్తుగొల్పుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement