మలుపు తిరిగిన పెదకాకాని శివాలయంలో ఆభరణాల మాయం కేసు
పోలీసులే పరుపుకింద ఆభరణాలు పెట్టి తన భర్తను ఇరికించారంటున్న అర్చకుడి భార్య
తన కుమారుణ్ణి పోలీసులు చిత్రహింసలు పెట్టి చోరీ కేసు అంటగట్టారని అర్చకుడి తల్లి ఆరోపణ
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో మాయమైన అమ్మవారి ఆభరణాల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులే పరుపుకింద ccపెట్టి తన భర్తను ఇరికించారని అర్చకుడు రణదీర్ భార్య మాధురి ఆరోపిస్తుండగా.. తన కుమారుడిని పోలీసులు 13 రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తూ చోరీ కేసును అక్రమంగా అంటగట్టారని అర్చకుడి తల్లి కొండవీటి మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.
‘ఒక్కసారిగా పది మంది పోలీసులు మా ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు తెరిపించారు. వారిలో కొంతమంది బెడ్రూంలోకి వెళ్లి పరుపు పైకెత్తి బంగారు నానుతాడు, మంగళసూత్రాలు కనిపించాయని తీసుకొచ్చారు. పోలీసులే పరుపు కింద వాటిని పెట్టి దొంగతనంలో నా భర్తను ఇరికించారు’ అని గర్భిణి అయిన అర్చకుడి భార్య మాధురి విలపించారు. రణదీర్ తల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ.. ‘నా కొడుకుని 13 రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. దొంగతనం చేసింది తానేనని అంటూ ఒప్పుకోవాలని వేధించారు.
శివాలయంలో అందరూ పర్మినెంట్ అర్చకులు. నా కొడుకు ఒక్కడే అదనపు అర్చకుడిగా పనిచేస్తున్నాడు. తమ వాళ్లను కాపాడుకునేందుకు వారంతా కావాలనే నా కుమారుడిని దొంగతనం కేసులో ఇరికించారు. మా బాబును పోలీసులు వేధిస్తున్నారని లాయర్ సహాయంతో హైకోర్టును ఆశ్రయించాం. అప్పటినుంచి మాపై కక్ష పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం మా కోడలు ఆస్పత్రికి సంబంధించిన రిపోర్టుల కోసం మంచంపై ఉన్న పరుపు తీసి వెతికాం.
అప్పుడు కనిపించని బంగారు నానుతాడు, మంగళసూత్రాలు ఇప్పుడు పరుపు కిందకు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. మా లాయర్ను కనుక్కుని సంతకం చేస్తానని చెప్పినా వినకుండా నా చేత బలవంతంగా సంతకం చేయించారు. పోలీసులే పరుపు కింద నగలు పెట్టి బయటకు తీశారు. రణదీర్ను చిత్రహింసలకు గురి చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడు అరెస్టు
శివాలయంలో అమ్మవారి ఆభరణాలు మాయం చేసిన నిందితుడు కొండవీటి రణదీర్ను అరెస్టు చేసినట్లు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పెదకాకాని పోలీసుస్టేషన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితుడు రణదీర్ను న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ఇదీ వివాదం..
ఆగస్టు 14న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. ఆ తరువాత 18న అమ్మవారికి అలంకరించిన మంగళసూత్రాలు, నానుతాడు కనిపించడం లేదని ఆలయ అర్చకులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో ఆ వారం రోజులు విధులు (వంతు) నిర్వహిస్తున్న అర్చకులకు 19న షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు 26న ఐదుగురిని సస్పెండ్ చేశారు. ఆలయ ఆభరణాల మాయంపై 21న కేసు నమోదు చేసిన పోలీసులు ఆ రోజు విధుల్లో ఉన్న అర్చకులను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు.
విచారణ పేరుతో పదేపదే పోలీసుస్టేషన్కు తిప్పుతూనే ఉన్నారు. ఆలయానికి సంబంధించిన చెత్త పడేస్తున్న ప్రదేశంలో పారిశుద్ధ్య కార్మికులతో వెతికించారు. ఈ క్రమంలో అర్చకులంతా చందాలు వేసుకుని ఆభరణాలు తయారు చేయిస్తున్నారని, చెత్తలో దొరికిందని చూపించేందుకు పథక రచన చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బంగారు ఆభరణాలు మాయమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోలీసులకు, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆగస్టు 27న నగర సంకీర్తన పేరుతో పెదకాకాని వైజంక్షన్ నుంచి శివాలయం వరకూ పాదయాత్ర చేపట్టారు.
అనంతరం వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించారు. సెపె్టంబరు 4న నానుతాడు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నట్టు ప్రకటించారు. కాగా.. ఆభరణాల మాయం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ చివరకు అర్చకుడు రణదీర్ ఇంట్లో దొరికినట్లు పోలీసులు ప్రకటించగా.. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రణ«దీర్ భార్య, తల్లి తాజాగా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.


