ఉపాధిలో ‘ఎంఎస్‌ఎంఈ’ల రికార్డు  | MSMEs are creating record in Employment creation | Sakshi
Sakshi News home page

ఉపాధిలో ‘ఎంఎస్‌ఎంఈ’ల రికార్డు 

Sep 8 2023 5:02 AM | Updated on Sep 8 2023 5:02 AM

MSMEs are creating record in Employment creation - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రికార్డు సృష్టిస్తున్నాయి. 2023–24లో ఎంఎస్‌ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్‌ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ పోర్టల్‌ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఆగస్టు నాటికే 93 శాతం లక్ష్యాన్ని సాధించడంతో గతేడాది తరహాలోనే రెండు రెట్లు అధికంగా ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు. 2022–23లో ఎంఎస్‌ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించిన సంగతి తెలిసిందే.   

లక్ష్యాన్ని దాటేసిన తొమ్మిది జిల్లాలు 
ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి.

చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే  317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్‌లో కనీసం 1.50 లక్షల ఎంఎస్‌ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశి్చమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement