
సాక్షి, విశాఖపట్నం: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. "విఫా" తుఫాన్.. చైనా, హాంకాంగ్లో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. "విఫా" తుఫాను అవశేషం... తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. క్రమేపీ బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.