తిరుపతిలో విద్యుత్ స్వాపింగ్ స్టేషన్ ప్రారంభం
దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన నెడ్క్యాప్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): విద్యుత్ ఆటోలు బ్యాటరీ (స్వాప్)లను మార్చుకోవడానికి, చార్జింగ్ చేసుకోవడానికి వీలుగా విద్యుత్ వాహన స్వాపింగ్ స్టేషన్ను నెడ్క్యాప్ సంస్థ తిరుపతిలో శుక్రవారం ప్రారంభించింది. మహతి ఆడిటోరియం ఎదురుగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ స్వాపింగ్ స్టేషన్ను నెడ్క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి ప్రారంభించారు. రేస్ ఎనర్జీ సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈవీ స్వాపింగ్ స్టేషన్ దేశంలోనే మొదటిదన్నారు. ఈ స్టేషన్ సత్పలితాలిస్తే విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నగరాలకు విస్తరిపచేస్తామన్నారు. ఈ స్టేషన్ ద్వారా గరిష్టంగా 12 ఆటోలకు బ్యాటరీ స్వాపింగ్ చేయవచ్చన్నారు. త్వరలో నగరంలో 200 ఆటోలను విద్యుత్ ఆటోలుగా మార్చే ఆలోచన ఉందన్నారు. అంతే కాకుండా 20 స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఇందు కోసం ఆర్టీసీ, టీటీడీ సహకారం కోరామన్నారు. చాలామంది డీజిల్ ఆటోల యజమానులు తమ వాహనాలకు రెట్రాఫిట్ కిట్లను కొనుగోలు చేసి విద్యుత్ ఆటోలుగా మార్చుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్నారు. నెడ్క్యాప్ జనరల్ మేనేజర్ సీబీ జగదీశ్వర రెడ్డి, ఓఎస్డీ ఎ.రామాంజనేయ రెడ్డి, రేస్ ఎనర్జీ ప్రతినిధి అరున్ శ్రేయాస్ పాల్గొన్నారు.