నిందలు కాదు.. నిజాలు తెలుసుకో | Kapu Leaders fires on Pawan Kalyan: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నిందలు కాదు.. నిజాలు తెలుసుకో

Jun 9 2026 5:13 AM | Updated on Jun 9 2026 5:13 AM

Kapu Leaders fires on Pawan Kalyan: Andhra Pradesh

పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు

‘కాపు ఆత్మగౌరవ సమావేశం’లో పవన్‌ తీరుపై చర్చ

టీడీపీ హయాంలోనే రంగా హత్య.. గద్దర్‌పై హత్యాయత్నం..

కన్వీనియంట్‌ రాజకీయాలకు కేరాఫ్‌ పవన్‌ 

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి.. నా వెనుక ఉంటే సీఎం అవుతానని అనలేదా? 

ఇప్పుడు కాపుల ఓట్లు అవసరం లేదంటారా? 

అదేమాట చంద్రబాబు, లోకేశ్‌తో చెప్పిస్తారా? 

వాడుకుని వదిలేయడానికి కరివేపాకులమా? 

మూడు దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నాం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వంగవీటి రంగాను కాపాడుకోలేదని ఏపీలోని కాపులను.. గద్దర్‌కు వెన్నులో తూటాలు దించితే కాపాడలేదని తెలంగాణ సమాజాన్ని నిందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆ రెండు ఘటనలూ టీడీపీ హయాంలోనే జరిగాయనే నిజాలను ఎందుకు విస్మరిస్తున్నారని కాపు నేతలు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రంగా పేరును ప్రస్తావించకుండా, కాపులను నిందించకుండా.. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్‌ తాళ్లూరి డైరెక్షన్‌లో మీ పార్టీని మీరు నడుపుకోవాలని పవన్‌కు సూచించారు. పవన్‌ అండ చూసుకుని సీఎం చంద్రబాబు కాపుల పట్ల తీవ్ర కులవివక్ష చూపిస్తున్నారని, సరైన సమయంలో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

ఈమేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు ఆత్మగౌరవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి (కేఆర్‌పీఎస్‌) రాష్ట్ర చైర్మన్‌ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్‌ చైర్మన్‌ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్‌ రావి శ్రీనివాస్, రాష్ట్ర కో–ఆర్డినేటర్లు జానపాముల నాగేంద్రకుమార్, జేటీ రామారావు, రాష్ట్ర కో–కన్వీనర్‌ బోడపాటి పెదబాబు, కాకిలేటి హరనాథ్, వంగా ఆంజనేయులు సోమవారం మీడియాకు వెల్లడించారు. కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్టం పోరాట సమితి ముఖ్య ప్రతినిధులు ఆత్మగౌరవ సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవల మంగళగిరి, రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపు సమాజాన్ని ఉద్దేశించి పవన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తామంతా కాపు సంఘాల్లో మూడు దశాబ్దాలకుపైగా పనిచేస్తూ కాపుల సంక్షేమం, రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం నిరంతర పోరాటం కొనసాగిçస్తున్నట్లు గుర్తు చేశారు. గత రెండేళ్లలో కాపు నాయకులెవరూ పవన్‌ను కలిసిందీ లేదు.. ఆయన అపాయింట్‌మెంట్‌ ఇచ్చిందీ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను ఉద్దేశించి కాపు నేతలు పలు ప్రశ్నలు సంధించారు.  

కాపు నాయకులు కన్వీనియంట్‌ రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం వేదికగా పవన్‌ వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీఅంత కన్వీనియంట్‌ పొలిటీషియన్‌ మరొకరున్నారా పవన్‌? మీ అంత స్థిరత్వం లేని పొలిటీషియన్‌ మరొకరున్నారా? పాచిపోయిన లడ్డూలు అన్నదెవరు? ఉత్తరాది, దక్షిణాది అనే ఫీలింగ్‌ చూపిస్తున్నారని అన్నదెవరు? ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం కవాతు చేస్తానని ప్రకటించి ఆ తరువాత కనపడనిది ఎవరు? మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవడమేమిటని అమరావతి పర్యటనలో ప్రశ్నించి తర్వాత ఆ విషయాన్ని వదిలేసిందెవరు? మా నాన్న హేతువాది.. సోషలిస్టు.. రామకోటి రాశారని రకరకాలుగా మాట్లాడిందెవరు? తనది వామపక్ష భావజాలమని, భగత్‌సింగ్, చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిందెవరు? నాకు కులం లేదు.. మతంలేదు అంటూనే నిరంతరం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నది మీరు కాదా? 

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇదే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు పవన్‌ చెప్పలేదా? కశ్మీర్‌ సమస్యకైనా పరిష్కారం దొరికింది కానీ కాపుల సమస్యకు పరిష్కారం లేదా? అని అనలేదా? కాపులు తనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు? కాపుల ఓట్లు తమకు అవసరం లేదని చంద్రబాబు, లోకేశ్‌తో చెప్పించగలరా?  

రాజకీయ ప్రత్యర్థి గా అంబటి రాంబాబును పవన్‌ విమర్శించారని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రజారాజ్యం, జనసేన కోసం పనిచేసిన దాసరి రామును ఉద్దేశించి పవన్‌ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు. కాపులు తనకు అండగా నిలబడలేదని.. తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ తనను వదిలేసి వెళ్లిపోయారని అంటున్న పవన్‌ అధికారంలోకి వచ్చాక బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు వెళ్లిపోయారో చెప్పగలరా? కాపు నాయకుల మూలాల మీదకు వెళతాం, వారి చిట్టాలు విప్పు­తామని బెదిరిస్తున్న పవన్‌.. మెగా కుటుంబానికి మూల స్తంభంగా కాపు కాసింది కాపులేనని విస్మరిస్తున్నారు. కాపులను నిందించి, బెదిరించి పవన్‌ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారనే విషయం అర్థమవుతోందా?  

  మీరంతా నా వెనుక ఉంటే ముఖ్యమంత్రినవుతానని గతంలో మీరు అన్న మాట ఎక్కడికి పోయింది పవన్‌? చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం కులాన్ని ఫుట్‌బాల్‌ ఆడుకుంటారా పవన్‌? వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని బొండా ఉమాతో ఉద్యమం చేయించిన చంద్రబాబును రెండేళ్లుగా ప్రశ్నించకపోవడం కన్వీనియంట్‌ రాజకీయం కాదా?  
కాపు సమాజంలో ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులున్నా కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా గుర్తించిందా? కనీసం ఒక్క జిల్లాకైనా కాపు నేతల పేరు పెట్టిందా?  

హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవోను తుంగలోకి తొక్కేసిన చంద్రబాబు కాపులకు తీరని అన్యాయం చేశారు. అదే చంద్రబాబు మైనారీ్టల రిజర్వేషన్ల విషయంలో రెండుసార్లు హైకోర్టు కొట్టివేసినా సమర్థి స్తున్నారు. ఇదేనా సమ ధర్మం? సమ న్యాయం? సామాజిక న్యాయం?

Advertisement
 
Advertisement
Advertisement