వాట్సాప్ ద్వారా మద్యం డోర్ డెలివరి.. ‘సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు’ | Kakani Govardhan Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

వాట్సాప్ ద్వారా మద్యం డోర్ డెలివరి.. ‘సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు’

Feb 11 2025 3:13 PM | Updated on Feb 11 2025 3:23 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu

సాక్షి,నెల్లూరు:  ‘రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా మద్యం డోర్‌ డెలివరీ అవుతుంది.. చంద్రబాబు ఇదేనా మీ సంపద సృష్టి అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.  మద్యం వ్యాపారులతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. మద్యం ధరల్ని పెంచారు. తద్వారా  ఏటా మూడు వేల కోట్లు చంద్రబాబు జేబులోకి వెళ్లనున్నాయి’అని విమర్శలు గుప్పించారు.

కూటమి ప్రభుత్వం లిక్కర్‌ ధరల్ని పెంచుతూ  తీసుకున్న నిర్ణయంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్ ధరలు పెంచి చంద్రబాబు బాదుడు మళ్ళీ షురూ చేశారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న మద్యం షాపుల్ని టీడీపీ నేతలకు కట్టబెట్టి.. ధరలు పెంచేశాడు. లిక్కర్ షాప్స్‌లో పని చేస్తున్న వారిని రోడ్డున పడేశారు.

ఎమ్మెల్యేల కనుసన్నల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.తక్కువ ధరకే మేలైన మద్యం ఇస్తానని హామీ ఇచ్చి.. ఉన్న ఫలంగా రేట్లు పెంచాడు.ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తూ.. టీడీపీ నేతలు జేబులు నింపుకునేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

పద సృష్టిస్తానని చెప్పి.. తన సంపద పెంచుకునే పనిలో పడ్డారు. ఎల్లో సిండికేట్స్‌ ఏకమై ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. మద్యం షాప్స్ దగ్గర నుంచి బెల్ట్ షాప్స్ దాకా.. స్థానిక ఎమ్మెల్యేలు కమిషన్స్ వసూలు చేస్తున్నారు. వందల కోట్ల కమిషన్స్ దండుకోవడంలో భాగంగా.. చంద్రబాబు మద్యం ధరలు పెంచారు.

చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు భారీగా వెళ్తున్నాయి. మద్యం వ్యాపారులతో చంద్రబాబు డీల్ కుదుర్చుకుని.. మద్యం ధరలు పెంచారు. ఏటా 3 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు జేబులోకి వెళ్ళబోతున్నాయి. వాట్సాప్ ద్వారా లిక్కర్ డోర్ డెలివరి అవుతుంది. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేశారు’ అని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement