
రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు, పాత్రికేయుల నిరసన
ఎక్కడికక్కడ ధర్నాలు.. ర్యాలీలతో కదంతొక్కిన జర్నలిస్టులు
విజయవాడలో భారీ ర్యాలీ.. తిరుపతి, కర్నూలులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ జర్నలిస్టుల ఆందోళన
సాక్షి నెట్వర్క్: ఎలాంటి సెర్చ్ వారంట్ లేకుండా గురువారం విజయవాడలో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి నానా హడావుడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణం అని, ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమని.. పత్రికా స్వేచ్ఛపై దాడి అని రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయ సంఘాల నేతలు, జర్నలిస్టులు మండిపడ్డారు. వ్యక్తి స్వేచ్ఛకు, పాత్రికేయులకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల కదంతొక్కాయి. వి
జయవాడలో నల్ల బ్యాడ్జిలు ధరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కలిమి శ్రీ, ఎడిటర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా ప్రతినిధులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మచిలీపట్నం, అవనిగడ్డలో ర్యాలీ నిర్వహించారు.
గుంటూరులో అంబేడ్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూరి్తకి వినతిపత్రం అందజేశారు. నరసరావుపేటలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
చిత్తూరు, అనంతపురం జిల్లాలోని అన్ని పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని కర్నూలులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఒంగోలుతో పాటు కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభంలో నిరనస ప్రదర్శన నిర్వహించారు.
పాత్రికేయులపై కూడా రెడ్బుక్ కుట్రా?
ఒకప్పటి బ్రిటిష్ పాలనకు వారసత్వపు హక్కులా ప్రస్తుత కూటమి పాలన ఉందని శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. శ్రీకాకుళం, టెక్కలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల వ్యాప్తంగా జర్నలిస్టులు ప్రభుత్వ దమననీతిని ఎండగడుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఏలూరులో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. తుని, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెదపూడి, పెద్దాపురం, అమలాపురం, కొత్తపేట, కపిలేశ్వరపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, నిడదవోలు, భీమవరం, ఆకివీడు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండలో పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
పోలీసు శాఖ ప్రతిష్ట దిగజార్చుకోవద్దు
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుచోట్ల కలెక్టరేట్ ఎదుట ధర్నాలకు దిగి కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వినతిపత్రాలు అందజేశారు. హైదరాబాద్లో సాక్షి ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జిలతో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఎవరో నిందితుడిని గాలిస్తున్న క్రమంలో ఎడిటర్ ఇంటికి వచ్చినట్టు పోలీసులు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
ప్రభుత్వాలు, అధికార పక్షాలకు మీడియా అనుకూలంగా ఉండాలనుకోవడం పొరపాటన్నారు. ప్రభుత్వాన్ని మెప్పించే క్రమంలో పత్రికాస్వేచ్ఛపై దాడి చేయడం, ఏకంగా ఎడిటర్, జర్నలిస్టులపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా పొలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారుతోందన్నారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు.