ISRO PSLV C55 With Two Singaporean Satellites Success - Sakshi
Sakshi News home page

శ్రీహరికోట నుంచి నింగికెగసిన PSLV-C 55 రాకెట్‌.. ప్రయోగం సక్సెస్‌తో సంబురాల్లో శాస్త్రవేత్తలు

Published Sat, Apr 22 2023 2:47 PM

ISRO PSLV C55 with two Singaporean satellites Success - Sakshi

సాక్షి, తిరుపతి/నెల్లూరు:  శ్రీహరికోట షార్‌(సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ISRO ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం శనివారం మధ్యాహ్నం జరగ్గా.. రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహననౌక. దీంతో షార్‌ కంట్రెల్‌ సెంటర్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగిపోయారు.

రాకెట్‌ ప్రయోగం కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ పర్యవేక్షించారు.  20.35 నిమిషాల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి ప్రవేశించాయి శాటిలైట్స్‌. 

ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్‌-2, 16 కేజీల బరువు ఉన్న లూమిలైట్‌-4 ఉపగ్రహాంను సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌(సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి ప్రవేశట్టింది రాకెట్‌. పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌.. బరువు 44.4 మీటర్ల పొడవు. 228 టన్నుల బరువు. సముద్ర భద్రతను పెంచడం కోసం లూమిలైట్‌ను ప్రవేశపెట్టింది సింగపూర్‌.

ఉపగ్రహాలను నిర్ణీతీ కక్ష్యలోకి వదిలేసిన తర్వాత.. ఆరిస్‌-2, పైలెట్‌, ఆర్కా-200, స్టార్‌బెర్రీ, డీఎస్‌వోఎల్‌, డీఎస్‌వోడీ-3యూ, డీఎస్‌వోడీ-06.. అనే చిన్నపాటి పేలోడ్లను సైతం ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ తరహా ప్రయోగం ఇక్కడ జరగడం ఇదే తొలిసారని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు.

ఇక.. ఇప్పటివరకు 424 విదేశీ ఉపగ్రహాలను  ప్రయోగించింది ఇస్రో. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్‌. 

ఏపీ సీఎం జగన్‌ హర్షం

తాడేపల్లి: PSLV-C55న రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఇస్రో బృందాన్ని అభినందించిన ఆయన.. రెండు సింగపూర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో చేర్చటంపై హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా..  ఇస్రో బృందం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారాయన. 

Advertisement
Advertisement