అన్నక్యాంటీన్ సిబ్బంది దౌర్జన్యంపై మున్సిపల్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తున్న బాధిత విద్యార్థులు
యలమంచిలి పట్టణంలో ఇంటర్ విద్యార్థులకు తీవ్ర అవమానం
భోజనం పెట్టేది లేదంటూ కాలర్ పట్టుకుని లాగేసిన అన్నక్యాంటీన్ సిబ్బంది
తీవ్ర అవమాన భారంతో వెనుదిరిగిన విద్యార్థులు
యలమంచిలి రూరల్: అన్న క్యాంటీన్లలో పనిచేసే సిబ్బంది తినడానికి వచ్చే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. తిన్న ప్లేట్లు కడగాలని దబాయిస్తున్నారు. యలమంచిలి కొమ్మాయిగుండం చెరువు సమీపంలో ప్రధాన రహదారి పక్కనున్న అన్న క్యాంటీన్ వద్ద 10 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని క్యూలో నిల్చుని ఉండగా అక్కడ పనిచేసే సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దీంతో వారు ఆకలితోనే వెనుదిరిగిన ఘటన శనివారం వెలుగు చూసింది.
పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ప్రశాంత్కుమార్, మదన్కుమార్, సెన్నంశెట్టి దుర్గాప్రసాద్, విజయ్ దుర్గాప్రసాద్, విజయ్రాజు, శివమణికంఠ, గోపీచంద్, లోకేష్, మోహన్, లక్ష్మీప్రసాద్ మధ్యాహ్నం భోజనానికి అన్నక్యాంటీన్కు వెళ్లారు. అక్కడ ప్లేట్లు పట్టుకుని క్యూలో నిల్చుని ఉండగా క్యాంటీన్లో పనిచేసే ఒక యువకుడు దు రుసుగా ప్రవర్తిస్తూ, అవమానకర రీతిలో మాట్లాడాడు. ఇద్దరు విద్యార్థుల చేతిలో ప్లేట్లు లాక్కుని, చొక్కా కాలర్ పట్టుకుని క్యాంటీన్ నుంచి బయటకు లాక్కెళ్లాడు. ఈ ఘటనతో తీవ్ర అవమాన భారంతో విద్యార్థి దుర్గాప్రసాద్ అక్కడి నుంచి బాధపడుతూ ఆకలితోనే వెళ్లిపోయాడు. తమకు జరిగిన అవమానంపై బాధిత విద్యార్థులు యలమంచిలి మున్సిపల్ కమిషనర్, పట్టణ పోలీసులకు శనివారం సాయంత్రం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.


