రైళ్ల రద్దుతో ఆర్టీసీకి పెరిగిన రద్దీ
సాక్షి, అమరావతిబ్యూరో: రైళ్ల రద్దు ఆర్టీసీకి కలిసొచ్చింది. రాజమండ్రిలో రైల్వే శాఖ నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. దీంతో విజయవాడ– విశాఖపట్నం మధ్య నడిచే 38 ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లను రద్దు చేశారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 8 వరకు వీటిని నడపడం లేదు. ఇప్పుడు ఈ రెండు నగరాల మధ్య రోజూ 10–12 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులే ప్రత్యామ్నాయంగా మారాయి.
రైళ్ల కొరతతో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణాలు పెరిగాయి. విజయవాడ–విశాఖపట్నం మధ్య డిసెంబర్ 25కు ముందు ఈ రూట్లో 84 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ప్రస్తుతం 93కి పెరిగింది. డిసెంబర్ 25కు ముందు విశాఖ–విజయవాడకు 16 షెడ్యూళ్లు తిరగ్గా అదనంగా మరో 25 సర్వీసులు పెంచారు. అలాగే డిసెంబర్ 25 నాటికి ఈ రీజియన్ రోజువారీ రాబడి రూ.1.04 కోట్లు ఉండగా 31కి రూ.1.15 కోట్లకు పెరిగినట్టు ఆర్ఎం నాగేంద్రప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు.