మాజీ సీఎం జగన్‌ నివాసంపై దాడి చేసిన వారి గుర్తింపు | YSRCP Chief YS Jagan Mohan Reddy House Attacked Accused Identified, More Details Inside | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం జగన్‌ నివాసంపై దాడి చేసిన వారి గుర్తింపు

Jun 24 2025 4:57 AM | Updated on Jun 24 2025 9:01 AM

Identification of attacked on YS Jagan mohan Reddy House

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటివద్ద తాటికాయలు విసిరిన కుమార్‌వంశీ, ధరణిసాయి

పొరపాటున తాటికాయలు విసిరారట! 

నిందితులతో కట్టుకథ చెప్పించిన పోలీసులు 

కేసు నమోదు చేయకుండానే నిందితులను వదిలేసిన వైనం

సాక్షి టాస్క్ ఫోర్స్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంపై తరచూ దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కూడా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి వైఎస్‌ జగన్‌ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాటికాయలు విసిరి పారిపోయారు. ఈ ఘటనపై ఆదివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు ఆ కారును గుర్తించి తెనాలికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం వారి వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.

‘తెనాలికి చెందిన కుమార్‌ వంశీ, ధరణిసాయి స్నేహితులు. కుమార్‌వంశీ చెన్నైలో, ధరణిసాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒక వీకెండ్‌లో తెనాలి వచ్చి ధరణిసాయికి చెందిన ఏపీ 39 బీక్యూ 1496 నంబరు గల కారులో తిరుగుతూ ఉంటారు. శనివారం కారుకు ఇంజిన్‌ ఆయిల్‌ మార్పించుకుని ఉండవల్లి సెంటర్‌ మీదుగా స్క్రూ బ్రిడ్జి దాటి సీతానగరం మీదుగా మంగళగిరిలోని మిత్ర దాబాకు వెళ్లారు. మార్గంమధ్యలో కారు దిగి మూత్రం పోసుకుని అక్కడున్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్లారు.

మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గరకు వెళ్లిన తర్వాత ఆ తాటికాయలను విసిరేశారు. అది పొరపాటుగా జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు’ అని వీడియోలో పేర్కొన్నారు. అయితే, వారు మూత్రం పోసిన ప్రదేశంలోని తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని ఆడుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు చెప్పిన ప్రకారం డంపింగ్‌ యార్డు వద్ద మలమూత్రాలను విసర్జిస్తారు. అలాంటి ప్రాంతంలో పడి ఉన్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని పొరపాటున విసిరినట్లు పోలీసులు చక్కగా వారికి ట్రైనింగ్‌ ఇచ్చి కట్టుకథను చెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించకుండా వారిద్దరూ పొరపాటు అయ్యిందని చెప్పిన వీడియోను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ నివాసం వద్ద ఎప్పుడూ సందర్శకులు ఉంటారు. అయినా అక్కడే కారు అద్దం దించి తాటికాయలు ఎలా లోపలికి విసిరేశారనే విషయాలను పోలీసులు ప్రశ్నించకుండానే, వారు చేసింది పొరపాటు, పోలీస్‌ డైరీలో నమోదు చేసి పొరపాటుగా నిర్ధారించి వదిలివేశామని చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement