
ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసిన మంత్రి నారాయణ
ఇప్పటికిది.. ఇకపై ఇంకెంతో.. ప్రజలపైనే ఈ భారం
రాజధానిలో ప్రభుత్వ తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ లోగుట్టు
1,200 మంది ఎన్నారైలు, బడా బాబుల మేలుకు ప్రభుత్వం కృషి
చ.అడుగు రూ.3,492 చొప్పున 2018లో ఫ్లాట్లను విక్రయించిన సీఆర్డీఏ
1,200 ఫ్లాట్ల విక్రయం ద్వారా సీఆర్డీఏకు వచ్చింది రూ.751.60 కోట్లు
అప్పట్లో నిర్మాణ పనులు రూ.658.45 కోట్లతో అప్పగింత
తద్వారా రూ.93.15 కోట్లు లాభమొచ్చిందని నాడు గొప్పలు
ఇప్పుడు ఆ పనులను రూ.1,009.36 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం
నిర్మాణ భారం తడిసి మోపెడు.. ఇప్పటికే రూ.315.60 కోట్లు నష్టం
ఈ లెక్కన రాజధాని నిర్మాణం కూడా ఇంతేనంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఖజానాకు ఇప్పటికే రూ.315.60 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మాణ సమయంలో ధరల సర్దుబాటు, డిజైన్ల మార్పు తదితరాల వల్ల నిర్మాణ వ్యయం మరింతగా పెరగడం.. తద్వారా మరింత నష్టం తథ్యమని అధికార వర్గాలు, బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. ఆ భారాన్ని ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న 1,200 మందిపై మోపబోమని, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఇప్పటికే సెలవిచ్చారు.
అంటే.. 1,200 మంది ఎన్నారైలు, బడా బాబుల ఫ్లాట్ల కోసం రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే రూ.315.60 కోట్ల భారం మోపారన్నది స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ పేరుతో 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో నిర్మించే 12 టవర్లలో 1,200 ఫాట్లను చదరపు అడుగు రూ.3,492 చొప్పున 2018లోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) విక్రయించింది. ఈ మేరకు ఎన్నారైలు, బడా బాబులు అడ్వాన్సులు ఇచ్చి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు.
హ్యాపీ నెస్ట్లో మొత్తం 21,52,349 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని విక్రయించడం ద్వారా సీఆర్డీఏ రూ.751.60 కోట్లు సమీకరించింది. ఆ రియల్ వెంచర్ నిర్మాణ పనులను అప్పట్లో రూ.658.45 కోట్లకు (చదరపు అడుగు నిర్మాణ వ్యయం సగటున రూ.3,059.26 చొప్పున) కాంట్రాక్టు సంస్థ షాపూర్జీ పల్లోంజీకి 2018 డిసెంబర్ 31న సీఆర్డీఏ అప్పగించింది. తద్వారా ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారానే రూ.93.15 కోట్ల లాభం వచి్చందని అప్పట్లో గొప్పగా చెప్పుకుంది.
» చంద్రబాబు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల వ్యయం పెరిగిందని.. ఆ భారాన్ని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిపై మోపబోమని, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి నారాయణ ఇప్పటికే తేల్చి చెప్పారు. తద్వారా ఆ నష్టాన్ని ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుల ద్వారా పూడ్చుకోనున్నారన్నది స్పష్టమవుతోంది.
» నిజానికి 2018–19 నాటికి.. ఇప్పటికి నిర్మాణ సామగ్రి, సిమెంటు, స్టీలు వంటి వాటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇసుక కూడా ఉచితమే. ఈ నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి అవకాశమే లేదు. కానీ.. గతేడాది సెపె్టంబరు 18న రూ.770.94 కోట్ల అంచనా వ్యయంతో హ్యాపీ నెస్ట్కు సీఆర్డీఏ మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.112.49 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఆ టెండర్నూ రద్దు చేసింది.
» మళ్లీ గతేడాది డిసెంబర్ 22న రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. మూడు నెలల్లోనే అంచనా వ్యయాన్ని రూ.47.09 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 4.68 శాతం అధిక ధరకు అంటే రూ.856.31 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. పైగా జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.153.05 కోట్లను అదనంగా చెల్లిస్తామని పేర్కొంది. ఈ లెక్కన రూ.1,009.36 కోట్లకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది.
» ఇక రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2016–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ లెక్కన హ్యాపీ నెస్ట్ రియల్ వెంచర్కు కేటాయించిన 14.46 ఎకరాల భూమి విలువ రూ.57.84 కోట్లు. దీన్ని కూడా కలుపుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు వ్యయం రూ.1,067.20 కోట్లకు చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.751.60 కోట్లు. అంటే.. హ్యాపీ నెస్ట్ ద్వారా ఇప్పటికే రూ.315.60 కోట్లు నష్టం వచి్చనట్లు స్పష్టమవుతోంది. నిర్మాణ సమయంలో పడే అదనపు భారం వల్ల ఆ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ భారం ప్రజలపైనే పడుతుందని బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు.
»సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన అమరావతి తన నిర్మాణానికి అవసరమైన నిధులను తానే సమీకరించుకుంటుందని (సెల్ఫ్ ఫైనాన్స్ సస్టెయినబుల్ కేపిటల్) సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బా, పచ్చి అబద్ధాలేనన్నది ‘హ్యాపీ నెస్ట్’తో తేలిపోయిందని రియల్టర్లు, బిల్డర్లు విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.