
భీమవరం(ప్రకాశం చౌక్): తన వ్యాఖ్యలతో స్వర్ణకారులు బాధపడుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెబుతున్నానని ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రవచనాలు చేయడానికి విచ్చేసిన ఆయన స్థానిక హోటల్లో బస చేశారు. తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ భీమవరానికి చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు.
దీంతో స్వర్ణకారుల సంఘం నుంచి పలువురు నాయకులు అలాగే కొందరు పెద్దల సమక్షంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2006 సంవత్సరంలో ఓ చానల్లో హాస్యం అనే కార్యక్రమంలో స్వర్ణకారుల గురించి తాను వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈ సందర్భంగా బయటకు వచ్చి బహిరంగంగా కూడా స్వర్ణకారులకు ఆయన క్షమాపణ చెప్పారు.