మానవ తప్పిదమే? | Fire Accident Due To Printed Circuit Board In Hotel At Vijayawada | Sakshi
Sakshi News home page

మానవ తప్పిదమే?

Aug 10 2020 4:46 AM | Updated on Aug 10 2020 4:49 AM

Fire Accident Due To Printed Circuit Board In Hotel At Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి:  కరోనా బాధితులున్న ప్రైవేట్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై విద్యుత్‌ భద్రత అ«ధికారులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రత లోపాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విద్యుత్‌ ఉన్నతాధికారులు ’సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. 

స్పార్కింగ్‌ ఇలా... 
♦ సెప్షన్‌ వద్దే మొదట స్పార్కింగ్‌ వచ్చినట్టు గుర్తించారు. కోవిడ్‌ ఆసుపత్రి కావడం, ఆల్కహాల్‌ శాతం ఎక్కువగా ఉండే శానిటైజర్లు వాడటమే మంటల వ్యాప్తికి కారణమన్న ఏకాభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైంది. 
♦ కంప్యూటర్లను వినియోగించేందుకోసం వాడే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులోకి శానిటైజర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. ధన, రుణ (ఫేజ్, న్యూట్రల్‌) మధ్య విద్యుత్‌ ప్రసరణ జరగడంతో  సర్క్యూట్‌ ఏర్పడిందని అధికారులు తెలిపారు. 

తప్పిదం ఇలా.. 
♦ కోవిడ్‌ రోగులున్న ఆ ప్రాంతంలో విద్యుత్‌ నియంత్రణ, భధ్రత తెలిసిన నిపుణులు లేరని సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్థన్‌రెడ్డి విశ్లేషించారు. మంటలు వ్యాపించగానే అక్కడ ఏమాత్రం నైపుణ్యం లేని సిబ్బంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. 
♦ విద్యుత్‌ నియంత్రణ చట్టం ప్రకారం ఉండాల్సిన డ్రై కెమికల్‌ పౌడర్, కార్బన్‌ డై ఆక్సైడ్‌ (సీవో2) ఉన్నాయా? వాటిని వాడాలనే పరిజ్ఞానం సిబ్బందికి లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈఎల్‌సీబీ లేదా? 
♦ ఎర్త్‌ లీకేజ్‌ సర్క్యూట్‌ బ్రేకర్స్‌ (ఈఎల్‌సీబీ) లేకపోవడం వల్లే భారీ అగ్ని ప్రమాదం జరిగిందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. 
♦ లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా మూతపడి ఉన్న హోటల్‌లో ఎలుకలు ఎక్కువగా ఉండవచ్చు. న్యూట్రల్‌ వైర్‌ను ఎలుక కొరికితే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ ఒక్కోసారి ఫేజ్‌ వైర్‌ను కొరకడం... ఆ ఎలుక భూమి మీదే ఉండటం... దీంతో ఎర్త్‌ కావడం జరుగుతుంది. ఫలితంగా షార్ట్‌ సర్క్యూట్‌కు ఆస్కారం ఉంది. హోటల్స్‌లో సాధారణంగా 30 మిల్లీ యాంప్స్‌తో ఈఎల్‌సీబీని అమర్చుకోవాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 
♦ ఎలుక వైర్‌ను కొరికి ప్రమాదానికి కారణమైందనే కోణమే నిజమైతే అక్కడ ఈఎల్‌సీబీ లేదని స్పష్టమవుతోందని పద్మా జనార్దన్‌రెడ్డి విశ్లేషించారు. ఇది నేరంగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు.   

దుప్పటి కప్పితే! 
♦ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దుప్పటి వేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది  కాదని సీపీడీసీఎల్‌ విద్యుత్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  
♦ హోటల్‌కు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ నిశితంగా పరిశీలించామని, హై వోల్టేజీదాఖలాలులేవని, హోటల్‌ సిబ్బంది తప్పిదాలే ప్రమాదానికికారణంగా తెలుస్తోందని సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement