ఊరంతా వన్నూరప్ప, వన్నూరమ్మలే.. | The entire village is worshipping Vannuru Swamy | Sakshi
Sakshi News home page

ఊరంతా వన్నూరప్ప, వన్నూరమ్మలే..

May 25 2025 3:04 AM | Updated on May 25 2025 3:04 AM

The entire village is worshipping Vannuru Swamy

మరవపల్లిలో వంద మందికి పైగా ఆ పేర్లతోనే..

గ్రామమంతా వన్నూరుస్వామిని కొలుస్తున్న వైనం 

ఏ శుభ కార్యమైనా ఆలయం వద్ద చక్కెర చదివింపులు

వన్నూరప్ప అని పిలిస్తే ఆ గ్రామంలో వంద మంది పలుకుతారు. వన్నూరప్ప, వన్నూరమ్మ, వన్నూర్‌రెడ్డి, వన్నూరక్క ఇలా..  హజరత్‌ వన్నూరు వలి సాహెబ్‌ను కొలిచేవారందరూ ఆయన పేరే పెట్టుకున్నారు. 30 ఏళ్లు పైబడిన సుమారు 100 మంది దాకా స్వామి పేరునే పెట్టుకున్నారంటే ఆయన మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది.

తాడిమర్రి: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని మరవపల్లిలో వెలసిన హజరత్‌ వన్నూరు వలి సాహెబ్‌ (వన్నూరు స్వామి) కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపదలు, జబ్బులు రాకుండా కాపాడుతున్నాడు. దీంతో గ్రామంలో ఎక్కువ మంది స్వామి పేరు కలసి వచ్చేలా పేర్లను పెట్టుకుంటున్నారు.  

200 ఏళ్ల క్రితం వెలసిన వన్నూరు స్వామి 
ఇప్పుడున్న మరవపల్లి గ్రామంలో 200 ఏళ్ల కి­త్రం రెండు, మూడు గుడిసెలు ఉండేవట. ఆ కా­లంలో ఇప్పుడున్న ఎం.అగ్రహారం గ్రామం చె­రు­వు పనులు జరుగుతుండగా కడప జిల్లా లింగా­ల మండలం అంకేన్‌పల్లికి చెందిన కొందరు ఇ­క్కడ చెరువు పనులు చేస్తూ గుడిసెల్లో ఉండేవా­రని పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలో­నే కణేకల్లు సమీపంలోని వన్నూరు గ్రామానికి చెంది­న వన్నూరుస్వామి గుర్రంపై తూర్పు ప్రాంతా­నికి యుద్ధానికి వెళ్లారట.

తిరుగు ప్రయాణంలో గుడిసెల వద్ద ఆగి వేపపుల్లతో పళ్లు తోముకుని పళ్లు తోముకున్న పుల్లను ఓ చోట భూమిపై గుచ్చారని అంటున్నారు. దీంతో అక్కడ వేపమాను మహావృక్షమైందని అంటున్నారు. ఆ మహనీయుడు అక్కడే ఉన్న బావిలో ముఖం కడుక్కొని ఆయన అక్కడే పాదరక్షలు వదిలి వెళ్లిపోయారట. గుడిసెల్లో ఉన్నవారు ఆ వృక్షం వద్ద పూజలు చేస్తూ వచ్చారని, దీంతో గ్రామస్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా వన్నూరుస్వామి కాపాడుతూ వచ్చరని భక్తుల నమ్మకం. 

స్వామి మహిమలు ఇలా.. 
సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎం.అగ్రహారంలో కలరా వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కలరాతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారట. అలాంటి విపత్కర సమయంలో కూడా మరవపల్లిలో ఒక్కరికీ కూడా కలరా సోకలేదని అంటున్నారు. ఆలయం పక్కన ఉన్న బావిలో వన్నూరుస్వామి ముఖం కడుక్కోవడంతో ఆ బావిలో మహిమలు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతారు. పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన అంధురాలు లింగమ్మ జీవితంపై విరక్తితో చనిపోవాలని బావిలోకి దూకిందట. 

దేవుని మహిమతో ఆమె ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడిందని చెబుతున్నారు. అలాగే బావి ఒడ్డున ఉన్న అరుగుపై పలువురు పిల్లలు ఆడుకుంటూ బావిలో పడిని చిన్నపాటి గాయం కూడా కాలేదంటున్నారు. దీంతో బావి రోడ్డు పక్కన ఉన్నప్పటికీ పూడ్చకుండా అలాగే ఉంచారు. నార్పలకు చెందిన శంకరయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం తన భార్యకు ఆరోగ్యం బాగాలేక లక్షలు ఖర్చుచేసి ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జబ్బు నయం కాలేదు. 

చివరకు గ్రామస్తుల ద్వారా స్వామి మహిమ గురించి తెలుసుకుని భార్యాభర్తలు కొన్నాళ్లపాటు ఆలయానికి వచ్చి పూజలు చేసి, అక్కడే నిద్రించారు. దీంతో ఆమె ఆరోగ్యం కుదుట పడింది. దీంతో ఆయన అప్పటి నుంచి ప్రతి గురువారం గ్రామానికి వచ్చి 10, 20 కిలోలు చక్కెర తీసుకొచ్చి స్వామికి చదివించి వెళుతున్నారు.  

ప్రతి గురువారం ప్రత్యేక పూజలు 
వన్నూరుస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో గ్రామస్తులే పూజలు చేసేవారు. కొంత కాలంగా మరవపల్లికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన ప్రతి గురువారం స్వామికి దీపాలను వెలిగించి చక్కెర చదివించి భక్తులకు పంచి పెడతారు. అలాగే కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి పొట్టేళ్లను కొట్టి గ్రామస్తులకు పంచుతారు. 

కందూరి చేసినప్పుడు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఉత్సవ పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం, శుభకార్యాలు జరినప్పుడు గ్రామస్తులు ముందుగా ఆలయంలో చక్కెర చదివించి ప్రారంభిస్తారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు, శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. 

కోరిన కోర్కెలు తీర్చే దేవుడు 
గ్రామంలో వెలసిన వన్నూరుస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడు. గ్రామంలో ఎవరు, ఎలాంటి శుభకార్యక్రమాలు చేపట్టిన ముందుగా ఆలయంలో దీపాలు వెలిగించి, చక్కెర చదివింపులు చేస్తాం. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి. – సాకే వన్నూరప్ప, మరవపల్లి, తాడిమర్ర

రోగాలైనా నయం అవుతాయి 
వన్నూరుస్వామి ఆలయంలో నిద్రచేస్తే ఎలాంటి రోగాలు అయినా నయం అవుతాయి. ప్రపంచాన్ని గడగడ లాండించిన కరోనా కాలంలో ప్రజలు ఎంతో భయబ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాలు కరోనాతో విలవిల లాడాయి. అలాంటి విపత్కర పరిస్థితిలో కూడా  మా గ్రామంలో ఎక్కరికి కూడా కరోనా సోకుండా స్వామి కాపాడారు. – గాండ్లపర్తి కుళ్లాయరెడ్డి, మరవపల్లి, తాడిమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement