చందాదారుల భద్రతే లక్ష్యంగా ‘ఈ–చిట్స్‌’ | E Chits aims at subscriber security | Sakshi
Sakshi News home page

చందాదారుల భద్రతే లక్ష్యంగా ‘ఈ–చిట్స్‌’

May 16 2023 4:19 AM | Updated on May 16 2023 10:30 AM

E Chits aims at subscriber security - Sakshi

సాక్షి, అమరావతి: చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో ‘ఈ–­చిట్స్‌’ సేవలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేస్టేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ అప్లికేషన్‌ను వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ.. చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ–చిట్స్‌ సేవలను అమల్లోకి తెచ్చిందన్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ రూపొందించిన ఈ నూతన ఎల్రక్టానిక్‌ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని చిట్‌ఫండ్‌ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందన్నారు. చిట్‌ఫండ్‌ లావాదేవీలను ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాల్సి ఉందని, రిజిస్ట్రేస్టేషన్‌ శాఖ అధికారులు కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదిస్తారని తెలిపారు. ‘ఈ–చిట్స్‌’ విధానంవల్ల చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలను అరికట్టడమే కాక చందాదారులు నష్టపోకుండా సహకరిస్తుందని మంత్రి చెప్పారు.

చిట్‌ఫండ్‌ కంపెనీల విషయంలో చందాదారులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాంతాల్లో నడుస్తున్న చిట్‌ఫండ్‌ సంస్థలు రిజిస్టర్‌ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఈ విధానంలో తెలుసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే అసిస్టెంట్‌ రిజిస్ట్రేస్టార్‌ ఆఫ్‌ చిట్స్‌ని కూడా ఈ విషయంలో సంప్రదించవచ్చన్నారు. అదే విధంగా చిట్‌ఫండ్‌ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటువంటి సమస్యలలైనా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని, ఆ సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించే అవకాశం ఈ నూతన విధానం ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు.

ఇంకా అదనపు వివరాలను https:// echits.rs. ap.gov.in  నుండి తెలుసుకోవచ్చని మంత్రి ధర్మాన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ వి.రామకృష్ణ, అడిషనల్‌ ఐజీ ఉదయభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement