శివరామకృష్ణన్ కమిటీని కూడా కాదని ఏకపక్ష నిర్ణయం సరికాదు
అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా?
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ చంద్రబాబు ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు.
రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వ ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోడానికి కారణమైందని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు.
భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపారని చెప్పారు. నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారని, ఇది భవిష్యత్లో అనేక సమస్యలకు దారితీస్తుందన్నారు.
అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తికావడానికి 50 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూలీలుగా మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణను వైఎస్ జగన్ ప్రతిపాదించారని చెప్పారు.
80 ఏళ్లయినా ఇంకా వలసలేనా?
ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. 80 ఏళ్లయినా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసింది నాటి సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. ఒడిశా సీఎంను కూడా కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబు ఏనాడైనా ఒడిశా వెళ్లి సమస్యలను ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు.


