
శాంతిభద్రతలపై వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు అమాంతం పెరిగిపోయాయి. హత్యలు, దోపిడీలు, దాడులు, మహిళలపై దారుణాలు, సైబర్ నేరాలు విపరీతమయ్యాయి. శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఈ విషయం సాక్షాత్తూ పోలీసుల శాంతిభద్రతల వార్షిక నివేదికలో వెల్లడైంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు శనివారం శాంతిభద్రతల వార్షిక నివేదిక–2024ను విడుదల చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాం..
సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, ఇతర పరిజ్ఞానం సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నట్టుగానే రాష్ట్రంలోనూ పెరిగాయన్నారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ద్వారా పటిష్ట కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ఏపీ పోలీస్ అకాడమీ(అప్పా), గ్రేహౌండ్స్ ప్రధాన కేంద్రాలను త్వరలో నెలకొల్పుతామని డీజీపీ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ అధికారిగా హడావుడి చేసిన రిటైర్డ్ సైనికోద్యోగిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
