
ఒకే సర్వే నంబర్లోని ఆస్తిని పలువురు రిజిస్టర్ చేయించుకోవాలంటే చుక్కలే
ఒకసారి ఒకరికి రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ సబ్ డివిజన్, మ్యుటేషన్ జరిగాకే రెండో రిజిస్ట్రేషన్
మూడో వ్యక్తికి రిజిస్ట్రేషన్ జరగాలంటే మళ్లీ అదే ప్రక్రియ పూర్తవ్వాల్సిందే
3 రిజిస్ట్రేషన్లకు నెల రోజులకుపైనే పడుతోందని వినియోగదారుల ఆందోళన
ఒక ఎకరం భూమిని ముగ్గురు కొనుగోలు చేసి ఒకరికి 50 సెంట్లు, ఒకరికి 25 సెంట్లు, ఒకరికి 25 సెంట్లు రిజిస్టర్ చేయించుకోవాలంటే.. ఒక్క రోజులోనే ముగ్గురికి రిజిస్ట్రేషన్ అయిపోయేది. – ఇది గతంలో అత్యంత తేలిగ్గా జరిగిన పద్ధతి
ఎకరం భూమిని ముగ్గురు కొంటే.. సర్వే నంబర్ను సబ్ డివిజన్ చేయించుకుని, మ్యుటేషన్కి పెట్టుకుని అడంగల్లోకి మారిన తర్వాత వారిలో ఒకరికి రిజిస్ట్రేషన్ అవుతోంది. దీనికి పది నుంచి 15 రోజుల సమయం పడుతోంది. మూడో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్లీ సబ్ డివిజన్, మ్యుటేషన్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇందుకు మరో 10, 15 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ఆస్తిని రిజిష్టర్ చేసుకోవడానికి అంతా సవ్యంగా ఉంటే నెల నుంచి 45 రోజులు.. ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకో నెల ఆలస్యం అవుతోంది. – ఇది ప్రస్తుతం నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితి
సజావుగా ఉన్న వ్యవస్థను బాగు చేసే పేరుతో అస్తవ్యస్తంగా మార్చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారం. గతంలో వెంటనే జరిగిన ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఒక సర్వే నంబఅలవాటుగా మారిపోయింది. దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారం. గతంలో వెంటనే జరిగిన ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఒక సర్వే నంబర్కు చెందిన ఆస్తిని వేర్వేరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్కు 2 నెలలు దాకా తీసుకుంటోంది. ఇది వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. – సాక్షి, అమరావతి
గతంలో ఎందరికైనా రిజిస్ట్రేషన్లు ఒక్క రోజులోనే అయిపోయేవి. ఎవరికివారు తమ భాగాన్ని రిజిస్టర్ చేయించుకుని డాక్యుమెంట్లు తీసుకునేవారు.
కూటమి సర్కారు వచ్చాక రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్లో తెచ్చిన మార్పుల కారణంగా సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఒక వ్యక్తి తన కుమారులకు ఆస్తి పంచి ఇవ్వాలన్నా ఇబ్బందులు నెలకొంటున్నాయి. భూముల రీ సర్వే పూర్తయిన తర్వాత కొత్తగా ఎల్పీఎం నంబర్ల రిజిస్ట్రేషన్లలోనూ ఇదే తరహా ఇబ్బంది నెలకొంది. ఒక రోజు అయ్యే పనికి ఇన్ని రోజులు జాప్యం ఏమిటని ప్రజలు అడిగితే తాము చేసేదేమీ లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు.
స్లాట్లో రిజిస్ట్రేషన్ కాకపోతే మళ్లీ చలానా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్తో.. సులభంగా మారాల్సిన రిజిస్ట్రేషన్లు ఇంకా కష్టతరం అవుతున్నాయి. ఆస్తుల క్రయవిక్రయాల కోసం వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలాచోట్ల బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగడంలేదు.
వినియోగదారులు స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజుల కింద ప్రభుత్వానికి కట్టిన చలానాలు చెల్లడం లేదు. ఇచ్చిన స్లాట్లో రిజిస్ట్రేషన్ జరక్కపోతే తర్వాత రోజు మళ్లీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం కొత్త చలానా నంబర్ చూపించాల్సి వస్తుండడంతో మళ్లీ కొంత కనీస మొత్తాన్ని చలానా కట్టాల్సి వస్తోంది. పలుచోట్ల దీనికోసం రూ.500, రూ.600 తీసుకుంటున్నారు.
ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్ష చలానా కట్టిన వ్యక్తికి ఇచ్చిన స్లాట్లో రిజిస్ట్రేషన్ చేయలేదనుకుంటే.. మరుసటి రోజు రూ.లక్ష బదులు రూ.500, రూ.600 అదనంగా చలానా తీయమంటున్నారు. ఆ చలానా నంబరుతో రిజిస్ట్రేషన్ పెట్టి, పాత స్లాట్లో కట్టిన చలానా మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇలా చేసినందుకు మళ్లీ అదనంగా వినియోగదారుల నుంచి కమీషన్ గుంజుతున్నారు.