‘వేవ్‌’లో కొట్టుకుపోతున్న ఉపాధి | CMIE report about job and employment opportunities in country | Sakshi
Sakshi News home page

‘వేవ్‌’లో కొట్టుకుపోతున్న ఉపాధి

May 15 2021 4:50 AM | Updated on May 15 2021 4:50 AM

CMIE report about job and employment opportunities in country - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్‌ వేవ్‌ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. ఒక్క ఏప్రిల్‌లోనే 70.35 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానవిు(సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. దీంతో ఏప్రిల్‌లో దేశంలో నిరుద్యోగిత 8 శాతానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌/కర్ఫ్యూ నిబంధనలతో ఏప్రిల్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. ఆ నివేదికలోని ప్రధానాంశాలు.. 

► దేశంలో ఉపాధి కార్యకలాపాల్లో కార్మికుల భాగస్వామ్యం ఏప్రిల్‌లో 39.98శాతానికి తగ్గిపోయింది. గతేడాది లాక్‌డౌన్‌ ఎత్తేశాక దేశంలో కార్మికుల భాగస్వామ్యం ఇంత ఎక్కువగా తగ్గడం ఇదే తొలిసారి. 
► ఈ ఏడాది మార్చిలో 6.80 శాతంగా ఉన్న నిరుద్యోగిత ఏప్రిల్‌లో 8 శాతానికి పెరిగింది. 
► ఏప్రిల్‌లో దేశంలో 70.35 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు.
► వీరిలో ఏకంగా 60లక్షల మంది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఆయా రంగాల్లో మార్చిలో 12 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా, ఏప్రిల్‌లో 11.40 కోట్ల మందికే ఉపాధి అవకాశాలు లభించాయి. 
► వ్యాపార రంగంలో రోజువారి కూలీలు 20 వేల మంది ఉపాధి కోల్పోయారు. 
► ఉద్యోగులు 3.40 లక్షల మంది తమ జాబ్‌లను కోల్పోయారు. మొత్తంమీద కరోనాతో ఏడాది కాలంగా 1.26 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. 2020 మార్చిలో దేశంలో 8.59 కోట్ల మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.33 కోట్లమందే ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయినవారిలో పట్టణ ప్రాంతాలకు చెందినవారు 68 శాతం, గ్రామీణ ప్రాంతాలవారు 32 శాతం మంది ఉన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement