వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review On Symptoms Of Disease In Pulla Village | Sakshi
Sakshi News home page

వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్ష

Jan 22 2021 2:04 PM | Updated on Jan 22 2021 4:21 PM

CM YS Jagan Review On Symptoms Of Disease In Pulla Village - Sakshi

సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ హుటాహుటిన ఏలూరు బయలుదేరారు. పూళ్లలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.(చదవండి: పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం)

అదుపులో పరిస్థితి: ఆళ్ల నాని
పశ్చిమగోదావరి: 
కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని.. గ్రామంలో ‘108’ వాహనాలను ఏడు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 25 మంది ఏఎన్‌మ్‌లు, ఆశావర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారని, రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్లను లాగారు. జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి. ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తాం. ప్రజలెవరూ ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని’’ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.(చదవండి: పరుగులు పెడుతున్న పోలవరం పనులు)

Advertisement
 
Advertisement
Advertisement