సలాం కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్‌

CM YS Jagan Consoles Abdul Salam Family In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారుకులైన దోషులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీఎస్పీ గెస్ట్‌హౌస్‌ వద్ద సలాం కుటుంబాన్ని సీఎం జగన్‌ నేడు పరామర్శించారు. సలాం అత్త మాబున్నీసా, శంషావలీ, షాజిదాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాబున్నీసా కుమార్తె షాజిదాకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆమె అల్లుడు శంషావలిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: సలాం‌ అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత)

ఈ క్రమంలో సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి.. నంద్యాల వైద్య ఆరోగ్యశాఖకు శంషావలిని బదిలీ చేస్తూ డిప్యూటేషన్ ఆర్డర్స్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మాబున్నీసా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంకు రుణపడి ఉంటామని కృతజ్ఞతాభావం చాటుకున్నారు. కాగా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై స్పందించిన సీఎం జగన్‌.. తక్షణమే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సలాం అత్త మాబున్నీసాకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 25 లక్షల ఆర్థికసాయం అందించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్‌ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top