కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను | Central Govt To Increase Revenue Of Municipalities And Corporations | Sakshi
Sakshi News home page

కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను

Apr 3 2022 11:16 PM | Updated on Apr 4 2022 9:10 AM

Central Govt To Increase Revenue Of Municipalities And Corporations - Sakshi

సాక్షి, అమరావతి: మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా పెంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణను నెలకొల్పడం, ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ‘ఫిస్కల్‌ రెస్పాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్‌బీఎం)’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది.

దీన్ని గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం సంస్కరణలను సైతం అమలు చేయాలని సూచించింది. దీనికనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ లెక్కల ప్రకారం.. ఆస్తి మార్కెట్‌ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణతోపాటు మరో 9 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. 

ఆస్తి విలువ ఆధారంగా పన్ను 
చట్ట ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మదింపు చేపట్టి అందుకనుగుణంగా ఆస్తి పన్ను పెంచాలి. కానీ వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో నివాసయోగ్య ఆస్తులు, 2007లో నివాసేతర ఆస్తుల (కమర్షియల్‌) పన్నును మదింపు చేశారు. అప్పట్లో ఆస్తుల వార్షిక అద్దె ప్రాతిపదికగా పన్ను విధానం అమలులో ఉండేది. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్‌ విలువ ప్రకారం.. పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement