
ఎగ్జిబిషన్ నిర్వాహకులతో పాటు కార్మికులపై అకారణంగా దాడి
బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా, అనుచరుల అరాచకం
తీవ్రంగా గాయపడిన కార్మికులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నాయకుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికార అండతో బీజేపీ నాయకులు అమాయకులపై దౌర్జన్యం చేయడం, దాడులకు తెగబడటం పరిపాటిగా మారింది. బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా, అతని అనుచరులు రాత్రి వేళ సమయం ముగిశాక ఎగ్జిబిషన్లోకి అనుమతించాలంటూ దౌర్జన్యం చేసి.. ఆపై నిర్వాహకులతో పాటు కార్మికులపై దాడికి దిగారు. అమాయకులైన ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై చేతికందిన వస్తువులతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది.
దాడికి గురైన బాధితులు న్యాయం చేయాలంటూ పట్టణ పోలీస్స్టేషన్కు వెళితే ఫిర్యాదు తీసుకుని చోద్యం చూడటం పోలీసుల వంతైంది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలో బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా బంధువులను వెంట పెట్టుకుని సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ధర్మవరం–అనంతపురం రోడ్డులోని ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లారు. సమయం ముగిసిందని, అనుమతి లేదని నిర్వాహకులు చెప్పారు. దీంతో షాహీన్షా ‘ఏరా.. మేము బీజేపీ నాయకులం. మాకే అనుమతి లేదంటావా?’ అంటూ బెదిరింపులకు దిగారు.
దీంతో భయాందోళనకు గురైన ఎగ్జిబిషన్ నిర్వాహకులతో పాటు కార్మికులు చేసేది లేక లోపలికి అనుమతించారు. వారు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతుండగా రెండు నిమిషాల పాటు విద్యుత్ అంతరాయంతో ఆగిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు ‘మేము తిరుగుతుంటే అదే పనిగా ఆపేస్తావా?’ అంటూ చేతికందిన వస్తువులతో ఎగ్జిబిషన్లో పని చేసే కార్మికును, నిర్వాహకుడి భార్య ఎల్లమ్మను దారుణంగా కొట్టారు. బాధితులు ఎల్లమ్మ, జశ్వంత్, రమేష్ భానులకు రక్త గాయాలయ్యాయి. దీంతో వారు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చోద్యం చూసినట్లు బాధితులు వాపోతున్నారు.