చంద్రబాబును అరెస్టు చేయాలి

Bahujan Parirakshana Samiti Leaders Fires On Chandrababu Naidu - Sakshi

సీఆర్డీఏలో కొత్త చట్టాలతో మోసం చేశారు

ఆయన వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉంది

173వ రోజు రిలే దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు

తాడికొండ: అమరావతి రాజధాని పేరిట యథేచ్ఛగా దోచుకునేందుకే చంద్రబాబు సీఆర్డీఏను ఏర్పాటు చేసి, అనుకూలమైన ఉద్యోగులను నియమించుకుని కొత్త జీవోలు, చట్టాలతో భారీ మోసానికి పాల్పడ్డారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా ఆ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారం 173వ రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆదివారం పలువురు నాయకులు మాట్లాడుతూ 480 ఎకరాల అసైన్డ్‌ భూములను బెదిరించి కొనుగోలు చేసిన వ్యవహారం అందిరికీ తెలిసిందేనని, దళితుల భూములు వారికి ఇవ్వడంతో పాటు దానికి కారకులైన చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదితరులను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని డిమాండ్‌ చేశారు.

దళితులను మోసం చేసిన చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నాలుగు వారాల గడువిస్తే వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు రాకుండా కోర్టుల్లో వేసిన తప్పుడు కేసుల్ని చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top