
జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరితెగించిన అధికార పార్టీ మూకలు
వైఎస్సార్సీపీ నేత అమరేశ్వర్రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డిపై హత్యాయత్నం
దాడికి దిగిన 30 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లినవారిపైన కర్రలు, రాళ్లతో దాడి
అమరేశ్వర్రెడ్డి తలకు బలమైన గాయం.. చేయి విరిగిన సురేష్ రెడ్డి.. బాధితులను పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల: ఏదైనా ఎన్నిక వస్తే ప్రజలకు తాము చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగడం రాజకీయ పార్టీలు పాటించే పద్ధతి. అనుకోని పరిస్థితుల్లో పదవిలో ఉన్న నాయకుడు చనిపోతే ఉప ఎన్నిక లేకుండా వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం గౌరవ సంప్రదాయం...! అయితే, తాము చేసింది ఏమీ లేక, రాజకీయాల్లో హుందాతనమూ మరిచిన టీడీపీ నేతలు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో బరితెగించారు.
ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట పచ్చ పార్టీ మూకలు చెలరేగాయి. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తుండగా టీడీపీ తమ అభ్యరి్థని నిలిపింది. తీవ్ర అనైతిక కార్యకలాపాలకు తెరలేపింది. చివరకు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు కూడా తెగిస్తోంది. ఇదంతా పోలీసుల అండతోనే జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
జైడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకుడు సైదాపురం సురేష్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సురేష్రెడ్డిపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సురేష్రెడ్డి మంగళవారం ∙బంధువు అమరేశ్వరరెడ్డితో కలిసి పులివెందులలో టీడీపీ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకకు హాజరయ్యారు. వారు కురీ్చల్లో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
సురేష్కు సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. దాడిలో అమరేశ్వరరెడ్డి తలకు బలమైన గాయమైంది. సురేష్ రెడ్డికి కమిలిన గాయాలయ్యాయి. చేయి విరిగింది. వీరిని పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఓటమి ఖాయమై అసహనంతోనే దాడులు: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
బాధితులను పరామర్శించిన అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ వారికి ఎక్కడా గెలుపు ఆశ కనిపించలేదని దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి ఉప ఎన్నికను కంట్రోల్లోకి తెచ్చుకోవాలని కుటిల పన్నాగం పన్నారని పేర్కొన్నారు. అమరే‹Ù, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లగా ఐదు వాహనాల్లో అక్కెళ్ల విజయ్కుమార్రెడ్డి, కిరికిరి బాషా, 30 మందిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో, రాడ్లతో దాడి చేశారని తెలిపారు. కేవలం ఈ ఎన్నిక కోసం భయభ్రాంతులకు గురిచేయడానికి, హత్యలకు సైతం వెనుకాడడం లేదని మండిపడ్డారు.

స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జి, చంద్రబాబుకు నిజంగా వారి పాలనపై నమ్మకం ఉంటే, సూపర్ సిక్స్ అమలు చేశామన్న ధీమా ఉంటే, ఉప ఎన్నికను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. అంతేగాని తమ కార్యకర్తలు, ఇతరుల మీద తీవ్ర దాడులు చేసి ప్రజ లను, భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలను నియంత్రించాలని అనుకోవడం పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని, పోలీసులు తొత్తులుగా ఉండడంతో తప్పుడు పనులు చేస్తున్నారని... చంద్రబాబు తప్పుడు సంస్కృతికి బీజం వేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రెచ్చగొట్టేలా దాడులు చేస్తే ఎవరూ భయపడరని తేల్చిచెప్పారు. దాడులు తక్షణమే మానుకోవాలని టీడీపీ నేతలను హెచ్చరించారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తాము కూడా కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కేసులున్నా, లేకపోయినా బైండోవర్ చేస్తున్నారని, మంగళవారం ఒక చిన్న మండలంలో వందమందిని బైండోవర్ చేశారని పేర్కొన్నారు. దీన్నిబట్టే వైఎస్సార్సీపీని ఎదుర్కొనడానికి చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలుస్తోందని చెప్పారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్కు మనవి చేస్తున్నామని, మీడియా కూడా ఫెయిర్ పోలింగ్కు చొరవ తీసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.