
సాక్షి, అమరావతి: కడప మేయర్ సురేశ్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం స్టే విధించింది.
కడప మేయర్(Kadapa Mayor) సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వరుస ఫిర్యాదులు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సురేష్ బాబును మేయర్ పదవి నుంచి ఏకపక్షంగా తొలగిస్తూ జీవో జారీ చేశారు. అయితే.. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
‘‘ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇచ్చారు. వీటి ఆధారంగా మేయర్ను డిస్ క్వాలిఫై చేశారు. కానీ, ఎమ్మెల్యే తన ఫిర్యాదును సీఎం కార్యాలయంలో ఇచ్చారు. సీఎం కార్యాలయం నోట్ను ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు రిఫర్ చేశారు. వివరణ ఇచ్చుకోవడానికి మేయర్ సురేష్ బాబుకు తగిన సమయం కూడా ఇవ్వలేదు. ఈలోగా ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు’’ అని సురేష్ బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. కడప మేయర్ తొలగింపునపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది: సురేష్బాబు
న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. ‘‘కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుట్ర పూర్వకంగా చేసిన కుట్రలు బట్టబయలు అయ్యాయి. న్యాయస్థానం సరైన తీర్పు ఇవ్వడం సంతోషకరం. ఎప్పటికైనా వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ఉంటుంది. కడప అభివృద్ధికి మేయర్గా ఎంతో కృషి చేశా. ఎమ్మెల్యే చేసిన కుయుక్తులు ఏవీ ఫలించలేదు’’ అని సురేష్ బాబు అన్నారు.

ఇదీ చదవండి: ఎంత అదిరిందో బాబుగారినే అడగాలి!