అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు

Anil Kumar Singhal Comments On False Propaganda - Sakshi

వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

పాజిటివ్‌ కేసులు, మరణాలను దాచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు

ఆ రెండు పత్రికలపై పరువు నష్టం దావా.. త్వరలోనే నోటీసులు

సాక్షి, అమరావతి: కోవిడ్‌పై అసత్య కథనాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రెండు పత్రికల్లో గుంటూరు జిల్లాలో కోవిడ్‌ వల్ల చనిపోయినట్లుగా రాశారని, వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం దురదృష్టకరమన్నారు. దీన్ని  ఖండిస్తున్నట్టు చెప్పారు. అసత్య కథనాలు రాసిన పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుందని, త్వరలో నోటీసులు పంపనున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో మృతి చెందిన 92 మందిలో 43 మందికి కరోనా రిపోర్టు నెగిటివ్‌ గా వచ్చిందని వారిని కూడా కోవిడ్‌ మృతులుగా ఎలా రాస్తారని ఆ రెండు పత్రికలను ప్రశ్నించారు.

పాజిటివ్‌ కేసులు గానీ, మృతులను కానీ దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి మరణాన్ని సమీక్షిస్తున్నామని, ఎక్కడా దీనిపై దాయాల్సిన పనిలేదని, వీడియో కాన్ఫరెన్స్‌లో రోజూ వీటిపై కలెక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు కొరత లేదని చెప్పారు. ఆక్సిజన్‌ పైప్‌లైన్‌తో కూడుకున్నవి 26,000 పడకలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నది 2 వేల మంది మాత్రమేనని తెలిపారు. రోజుకు 347 కిలోలీటర్ల ఆక్సిజన్‌ అవసరం ఉండగా 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని వివరించారు.

చదవండి:
హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి  
భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top