క్యాన్సర్‌కు కళ్లెం | Advanced Cancer Care Unit in Visakhapatnam | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు కళ్లెం

Jun 16 2025 4:32 AM | Updated on Jun 16 2025 4:33 AM

Advanced Cancer Care Unit in Visakhapatnam

విశాఖలో అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ కేర్‌ యూనిట్‌

హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో బ్లాక్‌

ఎనిమిది అంతస్తుల్లో 3.9 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు 

2027 నాటికి అందుబాటులోకి అత్యుత్తమ, అధునాతన వైద్య సేవలు 

టాటా మెమోరియల్‌ సెంటర్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.550 కోట్లు విరాళం 

ఇంటెన్సివ్‌ కీమో, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్‌థెరపీ ఇలా మరెన్నో.. 

విశాఖ సిటీ: క్యాన్సర్‌ కర్కశమైనది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కబళిస్తోంది. అటువంటి మహమ్మారి పీచమనచడానికి విశాఖ లో అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల క్యాన్సర్‌ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న అగనంపూడి ప్రాంతంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(హెచ్‌బీసీహెచ్‌ఆర్‌సీ)లో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్‌ క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్‌(శిశు, రక్త) క్యాన్సర్ల చికిత్స, పరిశోధనలకు సంబంధించి అతి పెద్ద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. 

క్యాన్సర్‌ రోగులకు అనేక సేవలు 
ఈ కొత్త బ్లాక్‌ ద్వారా క్యాన్సర్‌ రోగులకు అనేక వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో ఇంటెన్సివ్‌ కీమోథెరపీ, బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్‌ థెరపీ, కార్‌ టీ–సెల్‌ థెరపీ లాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు, మూడు లీనియర్‌ యాక్సిలరేటర్లు, ఎంఆర్‌ఐ, సీవీటీ అండ్‌ పెట్‌ స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్‌ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

అలాగే ఇందులో 14 బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ గదులు, 14 ఐసీయూలు, 5 ఆపరేటింగ్‌ థియేటర్లు, పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్‌ డిస్కషన్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్‌ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, బ్లడ్‌ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసం లాంటి సేవలు అందనున్నాయి. 

టీఎంసీకి ఐసీఐసీఐ రూ.550 కోట్లు విరాళం ఈ భారీ క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ భారీ విరాళాన్ని టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కు ప్రకటించింది. బ్యాంకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) నిధులు రూ.550 కోట్లతో ఈ అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ కేర్‌ని నిర్మిస్తోంది. 

దేశంలో క్యాన్సర్‌ కేర్‌కు సంబంధించి విశాఖ, నవీ ముంబై, న్యూ చండీగఢ్‌లో కొత్తగా మూడు టీఎంసీ కేంద్రాల ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.1,800 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ.550 కోట్లతో విశాఖలో శిశు, రక్త క్యాన్సర్‌ చికిత్సకు తూర్పు దేశంలోనే అతిపెద్ద అత్యుత్తమ మెడికల్‌ టెక్నాలజీతో అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు.  

ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..
ఐసీఐసీఐ ఫౌండేషన్‌ బ్లాక్‌ ఫర్‌ చైల్డ్‌ అండ్‌ బ్లడ్‌ క్యాన్సర్‌ భవనాన్ని 8 అంతస్తుల్లో సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ కొత్త భవనంలో 555 పకడలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్‌ క్యాన్సర్‌ రోగులు, 350–400 మంది హెమటోలింఫాయిడ్‌ క్యాన్సర్‌ పేషంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. 

కొత్త బ్లాక్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు ప్రస్తుత వైద్య సేవలను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యునోథెరపీకి వెసులుబాటు కలగనుంది. మరో 3 వేల మంది క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బ్లాక్‌ల్లో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉండనున్నాయి. పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2027 నాటికి ఈ కొత్త బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement