అనంతపురం: డీఎస్సీ–2025లో చోటు చేసుకున్న అక్రమాలపై విద్యార్థులు, యువత గర్జించింది. ఉద్యోగాలు అమ్ముకున్నారని, అర్హులకు మొండిచేయి చూపి దగా చేశారని మండిపడింది. జాతీయ స్థాయి ‘నీట్’ స్కాంను తలదన్నేలా డీఎస్సీ కుంభకోణం నిలుస్తోందని విరుచుకుపడింది. డీఎస్సీ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే గద్దె దిగాలంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురంలో చేపట్టిన చేపట్టిన ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి యువత, ప్రజలు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు తరలివచ్చారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహం వద్ద నుంచి ర్యాలీ మొదలైంది. జిల్లాపరిషత్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్కు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు.
జీవితాలతో చెలగాటం వద్దు
మెగా డీఎస్సీ అంతా దగానే అని, కష్టపడి చదివి పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని వైఎస్సార్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెట్టి.. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఒకే నోటిఫికేషన్తో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినా.. ఎక్కడా చిన్న ఆరోపణ కూడా రాలేదన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం చేసిన డీఎస్సీని అక్రమాల పుట్టగా మార్చేశారని విమర్శించారు. డబ్బులిస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి తెచ్చారన్నారు. కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందని యువత భావిస్తే కనీసం మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించకుండా పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి రెండేళ్లకు గాను రూ.75 వేల చొప్పున ప్రభుత్వం బాకీ పడిందన్నారు. విద్యార్థులకు సంబంధించి విద్యాదీవెన, వసతి దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కొణిదెల రమేష్రెడ్డి (రాప్తాడు నియోజకవర్గ పరిశీలకులు), నార్పల సత్యనారాయణరెడ్డి, సాకే రుత్విక్, తలారి సాయి హర్ష, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, వెన్నం శివారెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, జ్వాలాపురం శ్రీకాంత్, పామిడి వీరాంజనేయులు, చామలూరు రాజగోపాల్, పెన్నోబిలేసు, ఎగ్గుల శ్రీనివాసులు, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, ఎద్దుల అమర్నాథరెడ్డి, ప్రియాంక, కాగజ్ఘర్ రిజ్వాన్, మొఘల్ సైఫుల్లాబేగ్, ఓబిరెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాసనాయక్, అంజలి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, వంశీ, నగర ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి మసూద్, మంజు, నగర కార్యదర్శి హర్ష, రిజ్వాన్, గువ్వల రాజేష్రెడ్డి పాల్గొన్నారు.
అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో మానవహారంగా ఏర్పడిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన నేతలు.. ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
చంద్రబాబు ప్రభుత్వంలో స్కాంలు సహజమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ప్రభుత్వంపై అభద్రతాభావం ఏర్పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా చెల్లించకపోవడం, డీఎస్సీలో అవకతకవలపై యువతలో ఆందోళన నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే కోరుతున్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. సంబంధిత శాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి చిత్తశుధ్ధి నిరూపించుకోవాలి.
– కేతిరెడ్డి పెద్దారెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. డీఎస్సీ నిర్వహణపై వచ్చిన ప్రతి ఆరోపణలపైనా సీబీఐతో విచారణ చేయించాలి. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగాయనే వీడియోలు బయటకు వచ్చినా, ఫిర్యాదులు ఉన్నా.. అసలు సూత్రధారులను ఎందుకు బయటకు తీసుకురాలేదు. ప్రభుత్వం తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి.
– మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ
సమన్వయకర్త, రాయదుర్గం
నీట్ యూజీ పేపర్ లీకేజీ స్కాంను తలదన్నేలా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని లక్షలాది మంది అభ్యర్థులు వాపోతున్నారు. ప్రతి తప్పిదానికీ రుజువులు ఉన్నా ఈ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ చేపట్టదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు బాధ్యత వహించరు?
– బోరెడ్డి నరేష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు
లక్షలాది మంది యువతకు దగా
‘నీట్’ను తలదన్నేలా డీఎస్సీ స్కాం
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే
ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలి
నిరసన ర్యాలీలో యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్


