అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్నందున పశు, జీవసంపదకు గడ్డి కొరత ఏర్పడకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తొలివిడతగా రెండు చెరువులను ఎంపిక చేశారు. బుక్కరాయసముద్రం చెదళ్ల, గుంతకల్లు మండలం వైటీ చెరువు కింద 25 ఎకరాల చొప్పున 50 ఎకరాల్లో సాగు చేయడానికి చర్యలు చేపట్టినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. స్థానిక రైతుల ద్వారా జొన్న విత్తనాలు చల్లించడానికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ద్వారా మరికొన్ని చెరువులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
‘తల్లికి వందనం’
ఎందుకు అందలేదు?’
పామిడి: మండలంలో ఇద్దరు విద్యార్థులకు అర్హత ఉన్నా ‘తల్లికి వందనం’ పథకం వర్తించక పోవడంపై అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు పామిడి డిప్యూటీ ఎంపీడీఓ రంగనాయకులు మంగళవారం దేవరపల్లికి వెళ్లి విద్యార్థులు నక్కా అభిరామ్, నక్కా హర్షల తండ్రి నక్కా ఓబులేసుతో మాట్లాడారు. విద్యార్థుల తల్లి కీర్తి చనిపోవడంతో ‘తల్లికి వందనం’ డబ్బు జమ కాలేదని తెలుసుకున్నారు. అనంతరం ఎంఈఓ జయానాయక్తో ఫోన్లో మాట్లాడారు. ఓబులేసుతో కలిసి సచివాలయానికి వెళ్లి సిబ్బందితో సమస్యపై ఆరా తీశారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తానని డిప్యూటీ ఎంపీడీఓ తెలిపారు.


