అక్రమ నిర్మాణాల కోసం పెన్నానదిని పూడ్చి వేస్తున్న దృశ్యం
సాక్షి టాస్క్ఫోర్స్ : పెద్దవడుగూరు మండలం కొండూరు నుంచి తాడిపత్రి మండలం వంగనూరు వరకు దాదాపు 65 కిలో మీటర్ల మేర పెన్నానది పరివాహక ప్రాంతం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార టీడీపీ నేతలు పెన్నానదిలో ఇసుకను వ్యక్తిగత ఆదాయవనరుగా మార్చేసుకున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. అడిగేవారు లేరని పెద్ద ఎత్తున తోడేశారు. దీంతో ఎక్కడ చూసినా పెద్దపెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. అలాగే తాడిపత్రి సమీపంలోని నది పరివాహక ప్రాంతంలో ఏకంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోంది. 2017లో పెన్నానదిలో టీడీపీ ముఖ్య నేత పార్కు నిర్మాణం చేపట్టడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇవ్వడంతో పార్కు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు అదే పార్కు పక్కన పరివాహక ప్రాంతాన్ని పూడ్చి నిర్మాణాలకు పూనుకున్నారు. దీన్ని ఆపకపోతే భవిష్యత్తులో తాడిపత్రికి వరద ముంపునకు గురయ్యే అవకాశం లేకపోలేదు.
దిశ మారుతోన్న ‘దక్షిణ కాశీ’
తాడిపత్రిలో పురాతన బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద పెన్నానది ఉత్తర – దక్షిణ దశగా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా పేరుపొందింది. అయితే నదిలో అక్రమ నిర్మాణాల కారణంగా పెన్నానది స్వరూపం మారుతుండటంతో ‘ఉత్తర –దక్షిణ’ దిశలు మారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలుషితమవుతున్న పెన్నా నది
తాడిపత్రి మున్సిపల్ అధికారులు మురుగునీటిని పైపుల ద్వారా నేరుగా పెన్నానదిలోకి మళ్లిస్తున్నారు. దీంతోపాటు చుక్కలూరు, సజ్జలదిన్నె సమీపంలోని గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థం నీరు నేరుగా నదిలో కలుస్తోంది. పురాతన బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం వరకు నదిలో మురుగు కాలువలు ఏర్పడాయి. దీంతో నదిలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.
అక్రమంగా ఇసుక తవ్వకాలు
ఆక్రమణలో నదీ పరివాహక ప్రాంతం
దర్జాగా చదును చేసి.. నిర్మాణాలకు శ్రీకారం
టీడీపీ ముఖ్యనేతను నిలువరించలేక అధికారుల మౌనం


