అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా ఎండలు దంచేస్తున్నాయి. నాలుగు రోజులుగా 40 నుంచి 42 డిగ్రీలతో సూరీడు మండిపోతున్నాడు. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తాడిపత్రి, పెద్దపప్పూరు, శింగనమల, పెద్దవడుగూరు, కళ్యాణదుర్గం, పుట్లూరు, యల్లనూరు, విడపనకల్లు, నార్పల, రాప్తాడు, అనంతపురం తదితర మండలాల్లో మండేఎండలు జనాన్ని మాడ్చేస్తున్నాయి. ఈ నెల 9న తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటూ సాయంత్రం 5 గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆ తర్వాత రాత్రి ఉక్కపోత, వడగాడ్పులతో సెగలు పుట్టిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 22 నుంచి 28 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఇక మధ్యాహ్న సమయంలో జన, వాహన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రైతులు, శ్రామికులు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, రోగులు, పుట్పాత్ వ్యాపారులు ఎండలకు తాళలేక మరింత ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడం మంచిదని చెబుతున్నారు. కాగా రాగల నాలుగు రోజులూ ఇదేరకమైన పరిస్థితి ఉంటుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


