● ఎస్ఆర్సీ సిబ్బంది నిర్వాకం
శింగనమల: బ్లాస్టింగ్ సమయంలో సమీప పొలాల్లోకి ఎగిరిపడ్డ రాళ్లను తొలగించాలని కోరిన రైతులపై ఎస్ఆర్సీ సిబ్బంది అక్రమ కేసులు పెట్టారు. అనంతపురం నుంచి తాడిపత్రి వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎస్ఆర్సీ సంస్థ రోడ్డు పనులు చేపడుతోంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకర కోసం శింగనమల మండలం సి.బండమీదపల్లి పరిసర కొండల్లో బ్లాస్టింగ్ చేస్తోంది. బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో పెద్దపెద్ద రాళ్లు సమీపంలోని రైతుల పొలాల్లోకి ఎగిరిపడుతున్నాయి. పంట సాగుకు ఇబ్బందికరంగా మారడంతో రైతులు ఎస్ఆర్సీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. రాళ్లను పొలాల్లోంచి తొలగించాలని కోరారు. అయితే సిబ్బంది రాళ్లను తొలగించకుండా రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లాస్టింగ్ ప్రక్రియ ముందుకు సాగకుండా రైతులు అడ్డుకుంటున్నారని అందులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సుధాకర్, గోపీ అనే రైతులను పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రైతులు విలేకరులతో మాట్లాడారు. బ్లాస్టింగ్ చేసిన తర్వాత రాళ్లు తమ పొలంలోకి వచ్చి పడ్డాయని, వాటిని తొలగించండని కోరితే తమపైనే అక్రమ కేసులు పెట్టి.. పోలీసుల ద్వారా భయపెడుతున్నారని వాపోయారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.


