● ఏప్రిల్ 29 వరకు 3.20 లక్షల డోసులు
వేయాలని లక్ష్యం
అనంతపురం అగ్రికల్చర్: జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి వచ్చే నెల (ఏప్రిల్) 29 వరకు జిల్లా వ్యాప్తంగా పశువులకు ‘గాలికుంటు’ టీకాలు ఉచితంగా వేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురంలోని పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డిసీజెస్ డయోగ్నసి్ట్క్ ల్యాబ్) ఏడీ డాక్టర్ జి.రవిబాబు మీడియాకు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన పశువులు, ఎద్దులు, గేదెలు, దూడలకు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా కాగా, అందులో అనంతపురం డివిజన్కు 1.53 లక్షలు, ఉరవకొండ డివిజన్కు 1.67 లక్షల డోసులు సరఫరా చేశామన్నారు. పశువుల్లో వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన వ్యాధుల్లో గాలికుంటు ఉందని తెలిపారు. జ్వరం, నోరు, నాలుకపై పుండ్లు, కాలు గిట్టెలపై పుండ్లు, చొంగ కారడం, సరిగా నడవలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. పాల ఉత్పత్తి తగ్గిపోవడం, అబార్షన్ కావడం, అలాగే ఎద్దుల పనిచేసే సామర్థ్యం కోల్పోతాయని, నిర్లక్ష్యం చేస్తే మరణాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. రైతులు ముందుకు వచ్చి తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. అలాగే పశువుకు కేటాయించిన 12 అంకెల ట్యాగ్ నంబరును భారత్ పశుధాన్ యాప్లో నమోదు చేయడానికి పశుశాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇదే సందర్భంగా పశుశాఖ సిబ్బంది కూడా టీకాలు వేయకమునుపు, టీకాలు వేసిన 21 నుంచి 28 రోజుల తర్వాత రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపాలని సూచించారు.
18 నుంచి అధికారుల
చేతుల్లోకి పుర పాలన
రాయదుర్గం: నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 17న ముగియనుంది. ఈ నెల 16న చివరిసారిగా సమావేశాలు జరగనున్నాయి. 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 2021 మార్చి 18న 10 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 9 మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. సంపూర్ణ ఆధిక్యంతో వైఎస్సార్సీపీ మేయర్, చైర్మన్లు, వైస్ చైర్మన్లు కొలువుదీరారు. ఐదేళ్లు సమర్థవంతంగా పదవీ కాలం పూర్తిచేశారు. పట్టణాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. ఖజానాలో నిధుల్లేక అభివృద్ధి అటకెక్కింది. దీనికితోడు అడుగడుగునా ‘తమ్ముళ్లు’ అడ్డుపడడంతో గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయి.
జీఓ వచ్చేసింది..
మున్సిపాలిటీ, నగర కార్పొరేషన్లలో పాలకపక్షాల గడువు ఈ నెల 17న ముగుస్తుంది. పాలనా బాధ్యతలు ప్రత్యేకాధికారులు చేపడతారు. ఇప్పటికే ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
– నాగరాజు, మున్సిపల్ ఆర్డీ, అనంతపురం


