విడపనకల్లు: సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ భూముల్లోని సహజ వనరులను దోపిడీ చేసేస్తున్నారు. జేసీబీలను పెట్టి కొండలు, గుట్టలు కరిగించి జేబులు నింపుకుంటున్నారు. దోపిడీ పర్వం చేస్తున్న వారు అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతి నిధులు కావడంతో అడ్డుకట్ట వేసేందుకు ఏ అధికారీ సాహసించడం లేదు. విడపనకల్లు మండల పరిధిలోని ఆంధ్రసరిహద్దులో ఉన్న ఎర్రితాత గుట్ట వెనకభాగంలో ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ఉన్నాయి. వీటిపై కళ్యాణదుర్గం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధికి చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కన్ను పడింది. దీంతో స్థానిక టీడీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని అక్రమ తవ్వకాలతో మట్టి మాఫియాకు తెరలేపారు.
తెల్లవార్లూ అక్రమ రవాణా..
అధికార టీడీపీ నేతలు మట్టి దోపిడీ అంతా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. ఎర్రితాత గుట్ట వెనుక జేసీబీల సాయంతో మట్టి తవ్వి ఎస్ఆర్సీ కంపెనీకి చెందిన టిప్పర్లలో నింపుతున్నారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు టిప్పర్లలో మట్టిని జాతీయ రహదారి మీదుగా ఎకై ్సజ్ చెక్పోస్టును దాటించి కర్ణాటకలో విక్రయిస్తున్నారు. వందలాది ట్రిప్పుల మట్టిని టిప్పర్లు రవాణా చేసే క్రమంలో విపరీతమైన దుమ్ము లేవకుండా ఉండేందుకు రోజూ నీటితో ఆ మార్గం తడుపుతున్నారు. ఏకంగా విడపనకల్లు సత్యసాయి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి తాగునీటిని తీసుకొచ్చి ఇలా వదులుతున్నారు. ఎర్రితాత గుట్ట ప్రాంతంలో మట్టి తవ్వకాల నేపథ్యంలో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి.
పెద్దోళ్ల జోలికెళ్లరెందుకో..?
ఎవరైనా పేదలు ఇల్లు నిర్మించుకునే సమయంలో ఒక ట్రాక్టర్ మట్టిని తరలిస్తే చాలు పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు వచ్చి వాలిపోతుంటారు. ట్రాక్టర్ను సీజ్ చేసి కేసులు నమోదు చేసి హడావుడి చేస్తారు. అయితే పెద్దోళ్లు పబ్లిక్గా మట్టి దోపిడీ చేస్తున్నా ప్రేక్షకపాత్ర పోషించడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు కూడా మామూళ్లు స్వీకరించి.. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో మట్టి దోపిడీ పరాకాష్టకు చేరింది. స్థానిక టీడీపీ నేతల సహకారంతో పక్క నియోజకవర్గం కళ్యాణదుర్గం ముఖ్య ప్రజాప్రతినిధికి చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ చెలరేగిపోతోంది. రోజూ
వందలాది టిప్పర్ల మట్టిని కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటోంది.
ఆంధ్ర సరిహద్దు నుంచి
కర్ణాటకకు యథేచ్ఛగా రవాణా
‘పచ్చ’ నేతలతో ఎస్ఆర్సీ సంస్థ
చీకటి ఒప్పందం
కళ్లెదుటే తరలిపోతున్నా
పట్టించుకోని అధికార గణం
మట్టి మాఫియాకు
అధికారుల సహకారం
విడపనకల్లు మండల సరిహద్దులోఎర్రితాత గుట్ట వెనక, మోడల్ స్కూల్ సమీపంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం రోజూ రాత్రి పూట మట్టి తవ్వకాలు చేపట్టి టిప్పర్లలో వందలాది ట్రిప్పులు కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. మట్టిలోడుతో టిప్పర్లు 42వ జాతీయ రహదారి మీదుగా ఎకై ్సజ్ చెక్ పోస్టును దాటి వెళ్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? – చెండ్రాయుడు,
సీపీఐ ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి


