పాల నాణ్యతపై అనుమానాలు
● తనిఖీలు చేపట్టిన అధికారులు
అనంతపురం సెంట్రల్: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగడం వల్ల మరణాలు చోటు చేసుకోవడంతో అనంతపురంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆహారకల్తీ నిరోధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాల నాణ్యతపై అనుమానాలు రావడంతో బుధవారం మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు వివిధ చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10 పాల నమూనాలను సేకరించారు. వాటిని హైదరాబాద్ ఆహార పరీక్షా కేంద్రానికి పంపుతామని, ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత కల్తీ ఉన్నట్లు నిర్దారణ అయితే సంబంధిత విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు శ్రీనివాస్, జమాల్బాషా, ఏఓ వాసు ప్రకాష్, డీఈఈ హిమశైల, ఏఈఈ రాజశేఖర్, డీసీటీఓ సురేష్కుమార్, ఎస్ఐ నరేంద్రభూపతి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ దేవరాజు, తస్లీమా సిబ్బంది పాల్గొన్నారు.
పోక్సో కేసులో
ముద్దాయికి జైలు
శింగనమల: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ముద్దాయికి అనంతపురం పోక్సో ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను శింగనమల ఎస్ఐ విజయకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ముత్యాల సంపత్ 2020 జూన్ ఒకటో తేదీన ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తాగునీరు కావాలని ప్రవేశించాడు. బాలిక నీళ్లు తేవడానికి లోనికెళ్లగా ముత్యాలు తలుపులు మూసి, గడియపెట్టి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అరవడానికి ప్రయత్నించగా.. నోరు అదిమిపట్టి చంపుతానని బెదిరించాడు. అనంతరం బాలిక ఎలాగోలా తప్పించుకుని బయటకు పరిగెత్తుకొచ్చి జరిగిన విషయాన్ని పిన్నమ్మకు తెలిపింది. కొంతసేపటి తర్వాత కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అదేరోజు శింగనమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్హెచ్ఓ రాంభూపాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆ తరువాత ఎస్హెచ్ఓ మస్తాన్ పోక్సో ప్రత్యేక సెషన్స్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి చిన్నబాబు ఈ కేసులో మొత్తం ఏడుగురు సాక్షులను విచారించారు. ముద్దాయి ముత్యాల సంపత్పై నేరం రుజువు కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ విజయభాస్కర్ గౌడ్, ఎస్ఐ విజయకుమార్ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసులు, కానిస్టేబులు రామ్మోహన్, గంగాధర్ సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచి, ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసినందుకు ఎస్పీ జగదీష్ అభినందించారు.
పాల నాణ్యతపై అనుమానాలు


