సర్వేయర్ల పోరుబాట
● మార్చి 5 నుంచి సహాయ నిరాకరణ
● నిలిచిపోనున్న భూముల రీ సర్వే ప్రక్రియ
అనంతపురం అర్బన్: హామీల అమలు కోసం సర్వేయర్లు పోరాబాటకు సిద్ధమయ్యారు. మార్చి ఐదో తేదీ నుంచి సహాయ నిరాకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి నోటీసును గ్రామ సర్వేయర్ల సంఘం నాయకులు బుధవారం ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో భూముల రీ–సర్వే ప్రక్రియ నిలిచిపోనుంది. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలంటూ గతనెల 27న మొదటిసారిగా సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో 30వ తేదీన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన చర్చలు జరిపారు. ఫిబ్రవరి 15లోగా సమస్యలు పరిష్కరిస్తామని చర్చల సందర్భంగా హామీ ఇచ్చినట్లు నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి ముగుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మార్చి 4లోగా డిమాండ్లను పరిష్కరించకపోతే 5 నుంచి సహాయ నిరాకరణ బాట పట్టనున్నట్లు స్పష్టం చేశారు.
చర్చల్లో ప్రభుత్వ హామీలు
● స్వర్ణ గ్రామం వ్యవస్థలో సహచర సాంకేతి ఉద్యోగుల మాదిగా సమాన పే రోల్లో బేసిక్పే, పదోన్నతులు కల్పిస్తాం.
● ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రతిపాదనల తుది నివేదిక తయారు చేస్తాం.
● రీ–సర్వే నిర్వహణకు ప్రతి గ్రామానికీ ఒక ల్యాప్టాప్, ఒక రోవర్, ప్రతి మండలానికి ఒక ప్రింటర్ ఏర్పాటు చేస్తాం.
● రీ–సర్వే బిల్లులు ఫ్రిబవరి మొదటి వారంలో విడుదల చేస్తాం.
అమలు తీరు..
● ఫిబ్రవరి ముగుస్తున్నా పరికరాలు అందించలేదు.
● రెండు జిల్లాలు మినహా ఎక్కడా రీ–సర్వే బిల్లులు చెల్లించలేదు.
● హామీ ఇచ్చి 22 రోజుల గడిచినా పదోన్నతులకు సంబంధించి ప్రతిపాదనల ఫైలు సమర్పించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కొనసాగిస్తాం. మేము ప్రభుత్వానికి, భూముల రీ–సర్వే ప్రక్రియకు వ్యతిరేకం కాదు. మా 30 ఏళ్ల ఉద్యోగ భవిష్యత్తు దృష్ట్యా ఈ కార్యచరణ చేపడుతున్నాం. మా భవిష్యత్తు ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మా ఉద్యోగ జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతున్నాం.
– మహేష్నాయుడు, గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


