టమాట ధర ఢమాల్
● కిలో గరిష్టం రూ.8, కనిష్టం రూ.3
● రైతులకు దక్కని గిట్టుబాటు ధర
అనంతపురం అగ్రికల్చర్: టమాట ధర రైతులను ఊరిస్తూ ఉసూరుమనిపిస్తూనే ఉంది. ధర బాగుందని రైతులు సంబరపడేలోపే ఉన్నపళంగా పడిపోవడం కోలుకోలేని దెబ్బతీస్తోంది. తాజాగా టమాట ధర భారీగా పతనమైంది. ఎన్నో ఆశలతో రూ.లక్షలు పెట్టి పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడి కాదు కదా రవాణా, కూలీల ఖర్చులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాట మార్కెట్కు ఇటీవల కాలంలో రోజూ 500 టన్నుల నుంచి 800 టన్నుల వరకు సరుకు అమ్మకానికి వస్తోంది. అయితే ధరలు పూర్తిగా నేలచూపులు చూస్తుండటంతో దిక్కుతోచడం లేదు. గత నెలన్నర రోజులుగా అత్యంత నాణ్యమైన టమాట కొన్ని లాట్లు గరిష్ట ధర కిలో రూ.10 పలుకుతుండగా... ఇప్పుడు మరింతగా క్షీణించి రూ.8కి పడిపోయింది. వారం రోజులుగా టమాటను అడిగేవారు కరువయ్యారు. కనిష్ట ధర రూ.3కు మించడం లేదు. దీంతో మార్కెట్కు తరలించడానికి రవాణా ఖర్చులు, కమీషన్లకు కూడా రావడం లేదు. టమాట పరిస్థితి దయనీయంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో కంటితుడుపుగా రైతుల నుంచి కిలో రూ.5 ప్రకారం కొనుగోలు చేసి కొన్ని జిల్లాలకు పంపించారు. అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రభుత్వం ఏదో చేస్తోందని నమ్మించే యత్నంలో భాగంగానే నామమాత్రంగా చర్యలు చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది హెచ్చుతగ్గుల మార్కెట్ మధ్య టమాట క్రయవిక్రయాలు కొనసాగడంతో చాలామంది రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు.


