అరటి ఎగుమతి సమస్యలపై అధ్యయనం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ముంబయి మీదుగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులకు ఎదురవుతున్న సమస్యలపై ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎల్ఐడీసీ) అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం అనంతపురంలోని ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీహెచ్ డి.ఉమాదేవి, ఏడీహెచ్ దేవానందకుమార్తో పాటు ఎక్స్పోర్టర్లు, ట్రేడర్లు, ఎఫ్పీఓలతో ఏపీఎల్ఐడీసీ అధికారులు పవన్కుమార్సాహు, రామనాథ్రెడ్డి సమావేశమై చర్చించారు. రైల్వే సహకారంతో ఏసీ రెఫ్రిజిరేటర్ కంటైనర్ల ద్వారా అరటి ఎగుమతికి ప్రణాళిక ఉన్నా రవాణా ఖర్చులు, ఇతరత్రా అనుమతుల్లో జాప్యం కారణంగా సమస్యలు తలెత్తుతున్నట్లు జిల్లా అధికారులు, ఎగుమతిదారులు తెలిపారు. తాడిపత్రి నుంచి రైలు మార్గం ద్వారా ముంబయికు వెళితే.. అక్కడి నుంచి పోర్టు (నౌకాశ్రయం)లోకి అరటిని చేర్చడానికి సమయం తీసుకుంటున్నారని, అనుమతులు తొందరగా ఇవ్వడం లేదని వివరించారు. కంటైనర్లు కూడా సక్రమంగా అందుబాటులోకి రావడం లేదన్నారు. క్వాలిటీ చెకింగ్, అనుమతులు, క్వారంటైన్ తదితర ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంటుండడంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇక్కడే ‘డ్రై పోర్టు’ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో రెండు మూడు చోట్ల కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే రైతులు లేదా కంపెనీలు అరటిని అక్కడికి తీసుకువచ్చి... అక్కడి నుంచి కంటైనర్లకు లోడ్ చేయడం సులభమవుతుందని వివరించారు.


