9 నుంచి సాంస్కృతిక జాతా : సీపీఐ
అనంతపురం అర్బన్: సీపీఐ వందేళ్ల వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 18న చలో ఖమ్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక జాతా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే ఈ నెల 27, 28 తేదీల్లో నాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లా శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుళ్లాయప్ప, నిర్మాణ బాధ్యుడు జి.గోపాల్. జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి, నాయకులు మల్లికార్జున, చండ్రాయుడు, పుల్లయ్య పాల్గొన్నారు.
అండర్ –23 రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్కు జిల్లా క్రీడాకారులు
అనంతపురం కార్పొరేషన్: అండర్ –23 సీనియర్ మహిళల రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్కు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న వారిలో బి.అనూష, ఎన్.హరిత, బి.నేహ, ఎస్.అర్షియా నేహ, ఎ.హన్సిరెడ్డి ఉన్నారు. వీరు ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకూ శ్రీకాకుళం జిల్లా విజయనగరంలో జరిగే ప్రాబబుల్స్ మ్యాచ్ల్లో పాల్గొననున్నారు.
విద్యార్థిని అభినందించిన డీవీఈఓ
అనంతపురం కార్పొరేషన్: అండర్ –19 జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థి అమర్ ఎంపికయ్యాడు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జాతీయస్థాయి పోటీలు జరగనున్నాయి. పోటీలకు ఎంపికై న అమర్ను డీవీఈఓ వెంకటరమణనాయక్ తన కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
యువకుడి దుర్మరణం
రాయదుర్గం టౌన్: స్థానిక అనంతపురం మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మారుతి (30) వ్యక్తిగత పనిపై శుక్రవారం రాయదుర్గం వచ్చాడు. పని ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. పట్టణ శివారున అనంతపురం మార్గంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పై వెళుతుండగా కుక్క అడ్డుగా రావడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మృతదేహాన్ని రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
టీడీపీ నేతలపై ఫిర్యాదు
యల్లనూరు: మండల కేంద్రంలోని తేరు వద్ద గురువారం ఉదయం వైఎస్సార్సీపీ నేత, జెడ్పీటీసీ సభ్యుడు బోగతి విజయ ప్రతాపరెడ్డి, మరో ఐదారుగురిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారని ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. టీడీపీకి చెందిన సుబ్బరాయుడు, రామాంజనేయులు, ఆంజనేయులు, బాబు, ఓబులేసుతో పాటు మరో 18 మందిపై బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను నిర్ధారించుకున్న అనంతరం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాగా, తేరు వద్ద గురువారం చోటు చేసుకున్న గొడవకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం పాతపల్లి క్రాస్ వద్ద వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
ధర్మవరం అర్బన్: స్థానిక ఎర్రగుంట జంక్షన్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు (75) దుర్మరణం పాలైంది. శుక్రవారం తెల్లవారుజామున అర్బన్ హెల్త్ సెంటర్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
9 నుంచి సాంస్కృతిక జాతా : సీపీఐ
9 నుంచి సాంస్కృతిక జాతా : సీపీఐ


