నర్సీపట్నం: జిల్లాలోని అనుమతి ఉన్న మైనింగ్ లీజుల దగ్గర సీనరేజ్ వసూలు చేసే బాధ్యత తీసుకున్న కాంట్రాక్టర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల నుంచి తవ్వకాలు జరిగే వాటికే పర్మిట్లు, రసీదులు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వ భూములు, చెరువుల్లో అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. నర్సీపట్నం పరిధి బయపురెడ్డిపాలెం, పెదబొడ్డేపల్లి అమలాపురం, గొలుగొండ, నాతవరం మండలాల్లో కొన్ని రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. లేఅవుట్లు, స్థలాల చదునుకు చెరువుల్లో పెద్ద ఎత్తున అనధికారికంగా మట్టి తరలింపు జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయకట్టు రైతులు పొలాలకు మట్టి తీసుకువెళ్లాలన్నా కప్పం కట్టాల్సిందేనని ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. తవ్వకాలకు అనుమతులతో పని లేదు.. మాకు డబ్బు కట్టాల్సిందేనని సంస్థ సిబ్బంది సూచిస్తున్నారు. చీడిగుమ్మలలో సొంత అవసరాలకు మట్టి తీసుకు వెళ్తుంటే అడ్డుకోవడంతో సంస్థ సిబ్బంది, స్థానికులకు నడుమ ఇటీవల వివాదం చోటు చేసుకుంది.
బయపురెడ్డిపాలెం చెరువులో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు (ఫైల్)
జి
చేతి రాతలే పర్మిట్లు..
వసూళ్ల బాధ్యతను తీసుకున్న సంస్థ జిల్లాలో ఖనిజ సంపదను తమకేదో రాసిచ్చినట్టు చిన్న కాగితం ముక్కపై రబ్బర్ స్టాంప్ వేసి, దానిపై పెన్నుతో వాహనం నంబరు, తేదీ, సమయం, వసూలు చేసిన డబ్బులు, చెక్ పాయింట్ పేరు రాసి డ్రైవర్ల చేతిలో పెడుతున్నారు.
అడ్డదారుల్లో వసూళ్లు...
జిల్లాలో మైనింగ్ దోపిడీ విపరీతంగా పెరిగింది. సీనరేజ్ వసూళ్ల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో వారు వీలైనంత వరకు వసూళ్లు చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో సుమారు 90 వరకు మైనింగ్ లీజులు ఉన్నాయి. ఏడాదికి గతంలో రూ.14 కోట్లపైనే ఆదాయం ఉంటుంది. దీన్ని వసూలు చేసే బాధ్యతను గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించింది. ఈ సంస్థ ఏడాదికి రూ.18 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు.


