మహారాణిపేట: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో విశాఖలో ‘నేషనల్ ఫిషరీస్, ఆక్వా–మైరెన్ సమ్మిట్’ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ వాసుపల్లి తెలిపారు. గురువారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంక్షోభం రాష్ట్రంలోని అన్ని హార్బర్లలోని మత్స్యకారుల ఉమ్మడి సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఆక్వా రైతులు సీడ్ కొరత, ఫీడ్ ధరలు, దళారీ వ్యవస్థతో నష్టపోతుంటే, మరోవైపు మైరెన్ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. 15 ఏళ్ల క్రితం నాటి రొయ్యలు, చేపల ధరలే ఇప్పటికీ ఉన్నాయని, కానీ డీజిల్, కార్మిక వ్యయాలు, నిర్వహణ ఖర్చులు అనేక రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీటర్ డీజిల్ ధర రూ.104 దాటినా ప్రభుత్వం ఇచ్చే రూ.9 సబ్సిడీని పెంచకపోవడం మత్స్యకారుల నడ్డి విరుస్తోందన్నారు. మత్స్యకార భరోసా పథకంలో అర్హులైన వేలాది మంది సంప్రదాయ, మెకనైజ్డ్ బోట్ మత్స్యకారులను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. గతంలో మత్స్యకారుల సమస్యలపై అనేక సభల్లో గళమెత్తిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇప్పుడు డీజిల్ సబ్సిడీ, భరోసా కోతలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని జానకీరామ్ ప్రశ్నించారు.
రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్
అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్


